హైదరాబాద్ రిఫరెండంకు కెసిఆర్ సై: సిఎంగా ఓకే: కిషోర్
తెలంగాణపై హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనడాన్ని గొంతెమ్మ కోర్కెగా కెసిఆర్ కొట్టి పారేశారు. తాను గతంలో ఆంధ్రా వాలె బాగో.. తెలంగాణ వాలె జాగో అన్నది వాస్తవమేనని, ఈ విషయంలో వెనక్కి పోయిది లేదన్నారు. ముల్కీ నిబంధనలను తొలగించి, ఆరు సూత్రాల పథకాన్ని కుళ్లబొడిచి, తెలంగాణకు రక్షణగా ఉన్న 14(ఎఫ్)ను తీసేస్తే... ఇక్కడి ప్రజలు ఏం చేయాలన్నారు.
కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేయాలనుకుంటే... సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినప్పటికీ దాని ప్రభావం ఉండదన్నారు. అయినా రాజీనామాలు చేయటం వాళ్లకే వస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లు చేయలేరా అన్నారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎవరూ ఆపలేరన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరిట తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. ఒప్పందాల పేరుతో మోసం చేశారన్నారు.
గతంలో తెలుగోళ్లు విడివిడిగా ఉన్నారని, ఇక ముందు కూడా విడివిడిగా ఉండి స్నేహంగా ఉండాలన్నారు. విడిపోతే ఆంధ్రా కూడా బాగుపడుతుందన్నారు. కోట్లమంది తమతో కలిసి వస్తున్నారంటే తెలంగాణ ఆకాంక్షను గుర్తించాలన్నారు. నీటిని వాడుకునేందుకు కావాల్సింది వివాదం కాదని, విజ్ఞత అన్నారు. కేంద్రం పరిష్కారం దిశగా ఆలోచిస్తోందన్నారు. వైరంతో కలిసి ఉండటం కంటే స్నేహంగా విడిపోవడం మేలన్నారు.
కాగా కార్యక్రమంలో పాల్గొన్న సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి నేత కిషోర్.. కెసిఆర్ ఇన్నాళ్లు రెచ్చగొట్టి ఇప్పుడు శాంతిప్రవచనాలు పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి కెసిఆర్ను సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.