పాలిటిక్స్కు దూరం!: ఎన్టీఆర్, బాబు సాహసం: కల్యాణ్
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. తన పాదయాత్రను పొడిగించాలని చంద్రబాబు నిర్ణయించడం మంచి ఆలోచన అని జూనియర్ అభిప్రాయపడ్డారు. తాను టిడిపికి అండగా ఉంటానని చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు ఏమాత్రం లేదన్నారు. ఇప్పుడు తాను సినిమాల పైనే దృష్టి పెట్టానన్నారు.
తన అవసరముంటే పార్టీకి ఖచ్చితంగా పని చేస్తానన్నారు. తాను ఎవరికీ దూరంగా లేనని, తనకు అందరూ కావాలని చెప్పారు. షూటింగులో బిజీగా ఉండటం వల్లే తాను చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొనలేక పోయానని చెప్పారు. తాత చనిపోయిన ఈ రోజు ఎక్కువగా మాట్లాడటం తనకు ఇష్టం ఉండదన్నారు. అందర్నీ అభిమానించే మనందర్నీ ఆయన విడిచిపోయిన రోజు అన్నారు. విడిచిపోయినందుకు ఆయన పైన తనకు కోపం అన్నారు. హరికృష్ణ, హీరో కల్యాణ్ రామ్, రామకృష్ణలు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
అవినీతిపై ముందుగా పోరాడారు: హరికృష్ణ
ప్రస్తుతం అవినీతి బాగా పెరిగిందని హరికృష్ణ అన్నారు. అవినీతి పైన మొదట పోరాడింది స్వర్గీయ నందమూరి తారక రామారావే అన్నారు. అవినీతిపై అందరూ పోరాడాలన్నారు. పేదలు బాగుపడాలంటే ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని హరికృష్ణ అభిప్రాయపడ్డారు. బాబు తన యాత్ర వల్ల ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలుగు వాడి కీర్తిని ఖండాంతరాలకు చాటిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో పథకాలు చేపట్టారని, టిడిపిని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
63ఏళ్ల వయస్సులో సాహసం: కల్యాణ్ రామ్
చంద్రబాబు 63 ఏళ్ల వయస్సులో వస్తున్నా మీ కోసం పాదయాత్ర పేరిట సాహసం చేస్తున్నారని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. ఎన్టీఆర్ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందని కల్యాణ్ రామ్ ఆకాంక్షించారు.