శ్రీలక్ష్మికి ఊరట: మధ్యంతర బెయిల్ పొడగింపు
ఇంతకు ముందు లభించిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండడంతో ఆమె సోమవారం కోర్టు ముందు లొంగిపోవాల్సి ఉండింది. ఈ లోపు తన బెయిల్ గడువును పొడగించాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ పూర్తయిన తర్వాత శనివారం కోర్టు బెయిల్ గడువును పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులోని వెల్లూరులో చికిత్స చేయించుకునేందుకు కోర్టు ఆమెకు ఈ మధ్యంతర బెయల్ను మంజూరు చేసింది.
శ్రీలక్ష్మికి సిబిఐ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 8వ తేదీన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స నిమిత్తం కోర్టు ఈ బెయిల్ మంజూరు జేసింది. ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 20వ తేదీ తర్వాత ఆమె తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది. బెయిల్ ఇస్తూ శ్రీలక్ష్మికి షరతులు విధించింది. పాస్పోర్టును తమ ముందు పెట్టాలని, బెయిల్ సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స అవసరమని చెప్పడానికి ఆమె తరఫు న్యాయవాదులు వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు సమర్పించారు.
శ్రీలక్ష్మి తీవ్రమైన మానసికవ్యధతో నలిగిపోతున్నారని, అందువల్ల జైలులో ఉంటూ శస్త్రచికిత్స చేయించుకుంటే శస్త్రచికిత్స ఫలితం ఉండకపోవచ్చునని, బెయిల్ ఇస్తే కాస్తా మానసికంగా ఊరట చెందుతుందని, దానివల్ల శస్త్రచికిత్స ఫలితం ఇస్తుందని వైద్యులు ఇచ్చిన వివరణను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి కేసులో శ్రీలక్ష్మి ఆరవ నిందితురాలు. ఈ కేసులో ఆమెను సిబిఐ అధికారులు 2010 నవంబర్ 28వ తేదీన అరెస్టు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె ఒక్క రోజు మాత్రమే జైలులో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టు సిబిఐ కోరిక మేరకు బెయిల్ను రద్దు చేసింది. దీంతో ఆమె ఈ ఏడాది జనవరి 6వ తేదీన కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి ఆమె పలుమార్లు కింది నుంచి పైదాకా కోర్టుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు తోసివేతకు గురవుతూ వచ్చాయి.