తెలంగాణ: బాబును చిక్కుల్లో పడేసిన 'జగన్', డైలమా
దీంతో కొన్ని రోజుల పాటు మిగిలిన అన్ని పార్టీల నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. అయితే ఇటీవల కేంద్రం తనకు తానుగా విధించుకున్న 28వ తేది లోగా తెలంగాణపై అనుకూల ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సమైక్య నినాదం జోరందుకుంది. కేవలం రాజకీయ నాయకులతో సహా ఎపిఎన్జీవో ఇతరులు సమైక్యవాద కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇన్నాళ్లూ సీమాంధ్రకే పరిమితం అయిన సమైక్యవాద ఆందోళనలు, సభలు ఇప్పుడు హైదరాబాదుకు తాకాయి. సమైక్య ఉద్యమం క్రమంగా జోరందుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరికీ చంద్రబాబు టార్గెట్గా మారిపోయారు. ఒకవిధంగా కాంగ్రెసు పార్టీ వలలో చంద్రబాబు పడిపోయారని అంటున్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర రేపు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది.
ఈ సమయంలో బాబు పాదయాత్ర ఎలా ఉండనుంది, ఆయన ఎలా స్పందిస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణకు అనుకూలంగా అఖిల పక్ష సమావేశంలో అభిప్రాయం చెప్పడంతో కృష్ణా జిల్లాలో బాబును అడ్డుకునేందుకు సమైక్యవాదులు సిద్ధమవుతున్నారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కనువిప్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాబును కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
తాము బాబును అడ్డుకోమని, కనువిప్పు కలిగేలా కార్యాచరణ రూపొందిస్తామని, ఆయనకు పూలతో స్వాగతం పలుకుతామని లగడపాటి చెప్పారు. సమైక్యవాదులు పలువురు ఆయనను అడ్డుకొని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను నిలదీసే అవకాశాలు ఉన్నాయి. వైయస్ జగన్ ఫ్యాక్టర్ కారణంగానే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్ ఫ్యాక్టర్ బాబుకు ఇబ్బందులు తెచ్చిందని అంటున్నారు.
కాంగ్రెసు వలలో బాబు
అఖిల పక్ష సమావేశం కేంద్రం వ్యూహాత్మకంగా నిర్వహించిందని, టిడిపిని తమ వలలో పడేసేందుకే దీనిని ఉపయోగించుకున్నారనే వాదనలు తాజాగా వినిపిస్తున్నాయి. అఖిల పక్షం తర్వాత టిడిపికి ఒక్కసారిగా ఇమేజ్ పెరిగినా సీమాంధ్రలో ఆయనను అడ్డుకుంటే ఆయన అక్కడ చెప్పే దానిని బట్టి తెలంగాణలోనూ రియాక్షన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బాబు ఇరుక్కుపోయారని అంటున్నారు. త్వరలో అసెంబ్లీలో తెలంగాణలో తీర్మానం పెడితే బాబు మరింత చిక్కుల్లో పడతారని అంటున్నారు.
కాంగ్రెసు జాతీయ పార్టీ కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవని, టిడిపి ప్రాంతీయ పార్టీ మాత్రమే కాకుండా ఇటీవల జగన్ కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, మరోవైపు రెండుసార్లు అధికారానికి దూరంగా ఉందని, ఇలాంటి సమయంలో తెలంగాణపై తీర్మానం అంటే ఇరు ప్రాంతాల ఆ పార్టీ నేతలు ఒక్కతాటిపైకి రాకపోవచ్చునని అంటున్నారు. ఇది బాబు ఖచ్చితంగా ఇబ్బందులు తెచ్చే అంశమే అంటున్నారు. టిడిపిని మరింత చిక్కుల్లో పడేసేందుకే లగడపాటి రాజగోపాల్ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో తీర్మానం అనే వాదన ముందుకు తెచ్చారని అంటున్నారు.
తమ్ముళ్ల తర్జన భర్జన
తెలంగాణకు అనుకూలంగా టిడిపి అధిష్టానం అఖిల పక్షంలో చెప్పడంతో సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాబు యాత్రను అడ్డుకుంటే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై తెలుగు తమ్ముళ్లు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు అంతర్మథనంలో పడినట్లుగా చెబుతున్నారు.