ఆ ఇద్దరికి షాక్: ధర్మాన రాజీనామా ఆమోదం తప్పదా?
ఈ నెల 31వ తేదీన కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు సమన్లు జారీ చేసింది.ఈ కేసులో ఇప్పటికే మోపిదేవి వెంకటరణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజీనామాను నైతిక దృష్టితో ఆమోదించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాన్పిక్ వ్యవహారంలో సిబిఐ తనను నిందితుడిగా చేర్చడంతో ధర్మాన ప్రసాద రావు మంత్రి పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే, ఆ రాజీనామా పెండింగులో ఉంది.
ధర్మాన ప్రసాదరావు రాజీనామాను తిరస్కరిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానం చేసి, ఈ మేరకు ఫైల్ను గవర్నర్ నరసింహన్కు పంపించింది. అయితే, దాన్ని మరోసారి పరశీలించాలని గవర్నర్ ఆ ఫైల్ను వెనక్కి పంపించారు. దానిపై ప్రభుత్వం గానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్కు సిబిఐ కోర్టు అనమతించడంతో ప్రభుత్వం అత్మరక్షణలో పడింది.
ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకపోవడంపై ఇప్పటికే పలు వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. మోపిదేవికి ఓ న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ స్థితిలో ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలకు మేలు చేస్తూ ధర్మాన ప్రసాదరావు నిర్ణయం తీసుకున్నారని సిబిఐ అభియోగం మోపింది.