సమైక్యమనండి: సీమాంధ్ర నేతలు, ఇంఛార్జిని కాదు: దిగ్గీ
ఉదయం కేంద్రమంత్రి వాయలార్ రవిని కలిశారు. అయితే ఆలస్యంగా వెళ్లడంతో ఆయన రేపు సాయంత్రం కలవమని చెప్పారు. అనంతరం వారు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తాను ఆంధ్ర ప్రదేశ్ ఇంఛార్జిని కాదని, ఆ వ్యవహారాన్ని గులాం నబీ ఆజాద్ చూసుకుంటారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం త్వరలో ఓ ప్రకటన చేస్తుందన్నారు.
ఏం చేస్తుందనే విషయం తనకు తెలియదని అది కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు తెలుసునన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తన అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రికి ఎప్పుడో చెప్పిందన్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అన్నారు. త్వరలో ఆ నిర్ణయం వెలువడుతుందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత మోతిలాల్ వోరాని కలిశారు. వారు వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు.
ఎపిఎన్జీవో ప్రతినిధులు కూడా దిగ్విజయ్ సింగ్ను కలిశారు. వారితో కూడా దిగ్విజయ్ ఇదే విషయం చెప్పారు. కాంగ్రెసు పార్టీ, కేంద్రం పెద్దలను కలిసి తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతామని వారు అన్నారు. ఈ నెల 28వ తేది లోపు ఓసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమైక్యతకు ఎలాంటి హాని జరిగినా ఎంతకైనా తెగిస్తామన్నారు.
మరోవైపు ఢిల్లీకి వెళ్లాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు నిర్ణయించుకున్నారు. సిఎల్పీలో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. రేపు ఢిల్లీ వెళ్లాలని అందరూ నిర్ణయించుకున్నారు. తాము ఢిల్లీ వెళ్తున్నామని, తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తామన్నారు. సీమాంద్ర నేతలు పరుషపదజాలంతో మాట్లాడటం సరికాదన్నారు.