ఆలస్యమైంది, రేపు రండి: సీమాంధ్ర నేతలతో వాయలార్
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు అధిష్టానాన్ని, కేంద్రాన్ని కోరనున్నారు. ఉదయం వారు రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పరిశీలకులు వాయలార్ రవిని కలిసేందుకు వెళ్లారు. అయితే వారు అపాయింటుమెంట్ కన్నా అరగంట ఆలస్యంగా వచ్చారు. దీంతో వారు వస్తున్న విషయం తెలుసున్న వాయలార్ వారు రాగానే మీరు ఆలస్యంగా వచ్చారని, తాను కేరళ పర్యటనకు బయలుదేరుతున్నానని, రేపు సాయంత్రం వస్తే అప్పుడు మాట్లాడాకుందామని సీమాంధ్ర నేతలకు సూచించారు. దీంతో వారు దిగ్విజయ్ సింగ్తో భేటీ అయ్యారు.ఆ తర్వాత మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్లను కలుస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిసే అవకాశముంది.
సీమాంధ్ర నేతల్లో ఆందోళన
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీమాంధ్ర నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన ఉంటుందేమోననే అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంగానే ఉంచేందుకు అధిష్టానాన్ని ఒప్పించేందుకు వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఢిల్లీకి బయలుదేరే ముందు మంత్రి గంటా, తోట నరసింహం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ ఉన్నత పదవిలో ఉన్నారని ఆయనకు ఆవేశం పనికిరాదన్నారు. తమకు ఢిల్లీకి ముఠాలు మోసుకెళ్లే స్థోమత లేదన్నారు. డిసెంబర్ 9న ప్రకటన కోసం తెలంగాణ నేతలు ఎన్ని సంచులతో వెళ్లారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఢిల్లీ పెద్దలను, కేంద్రాన్ని కోరుతామన్నారు.
తెలంగాణకు కేంద్రం నో
తెలంగాణకు కేంద్రం సుముఖంగా లేదని కాంగ్రెసు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ అన్నారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్రలో కూడా సమైక్యాంధ్ర సెంటిమెంట్ ఉందన్నారు. కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు సిఎల్పీలో భేటీ అయ్యారు.