ఫాంహౌస్లో తెలం'గానం': కెసిఆర్ పైనే అందరి దృష్టి
అయితే ఎప్పుడూ బయట ఉండి సమైక్యవాదుల పైన నిప్పులు చెరిగే కెసిఆర్ అప్పుడప్పుడు కొద్ది రోజులు మెదక్ జిల్లాలోని తన ఫాం హౌస్కు పరిమితం అవుతారు. ఆయన సైలెంటుగా ఉన్నా మాట్లాడినా ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఆయన ఫాం హౌస్లో ఉన్నప్పుడు అక్కడ వ్యూహాలు రచిస్తున్నారనే వార్తలు వచ్చేవి. అయితే ఇప్పుడు తెలంగాణకు అనుకూల ప్రకటన వస్తుందన్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా కెసిఆర్ ఫాంహౌస్కు పరిమితం కావడం రాజకీయవర్గాలతో పాటు బయటా చర్చనీయాంశమైంది.
ఆయన గత కొద్ది రోజులుగా ఫాంహౌస్కే పరిమితమయ్యారు. తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన రావడానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో కెసిఆర్ బయటకు రావడం లేదు. అఖిల పక్ష సమావేశానికి కెసిఆర్ వెళ్లే ముందు, హాజరైన తర్వాత మాట్లాడుతూ.. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయలేదు. అఖిల పక్షాన్ని జోక్గా కొట్టిపారేశారు.
తెలంగాణ వస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఒకవేళ కేంద్రం ప్రకటన వ్యతిరేకంగా ఉంటే ఏం చేయాలనే దానిపై కెసిఆర్ పక్కా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారట. ఈసారి పకడ్బందీగా ఆయన వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ కూడా నిన్న మాట్లాడుతూ.. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే మిలిటెంట్ తరహా ఉద్యమానికి సిద్ధమన్నారు.