సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఎదెరుదురు: పోటీ స్లోగన్స్
వాయలార్ రవిని తొలుత సీమాంధ్ర నాయకులు నాయకులు కలిసి తమ వాదనలను వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని వారు వాయలార్ రవికి వివరించారు. సీమాధ్ర నాయకుల వాదనలను కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తానని ఆయన చెప్పారు. మీ వాదనలో కొన్ని వాస్తవాలున్నాయని, ఆ విషయాలను ముందే ఎందుకు చెప్పలేదని వాయలార్ రవి సీమాంధ్ర నేతలతో అన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అవతరణ చరిత్రను సీమాంధ్ర నాయకులు ఆయనకు వివరించారు.
తెలంగాణలో సెంటిమెంట్ లేదని గాదె వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓట్ల శాతం పడిపోయిందని, గత ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేసి పది సీట్లలో మాత్రమే తెరాస గెలిచిందని, తెరాస రెచ్చగొట్టిందని, బావోద్వేగాలను రెచ్చగొట్టి తెరాస గెలిచిందని ఆయన అన్నట్లు సమాచారం. ఇరు ప్రాంతాల నేతలు కూర్చుని పరిష్కార మార్గం సూచించాలని, ఈ విషయాన్ని అధిష్టానానికి సూచిస్తానని వాయలార్ రవి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. గాదె వెంకటరెడ్డితో వాయలార్ రవి ప్రత్యేకంగా మాట్లాడారు.
అంతకు ముందు, తెలంగాణ నేతలు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. విభజనకు తప్ప మరోదానికి అంగీకరించబోమని వారు ఆయనతో చెప్పారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసంలో సమావేశమై చర్చించుకుని వాయలార్ రవి వద్దకు వచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు సీమాంధ్ర నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు.