ఐటి తెలంగాణ కోసమా?: ఎపిఎన్జీవో, తెలంగాణపై కిషోర్
ఎపిఎన్జీవో ప్రశ్నల పరంపర
తమ ఢిల్లీ పర్యటన ద్వారా రాష్ట్ర విభజన జరగదని తేలిపోయిందని ఎపిఎన్జీవోలు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్రలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రాజకీయ పార్టీలతో కలిసి ఓ ఐక్యకార్యాచరణ సమితి(జెఏసి)ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని ప్రాంతాల పరిస్థితి సోమాలియా కంటే అధ్వాన్నంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రం అన్నింటిని పరిగణలోకి తీసుకొని సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు ఐటి కంపెనీలు కేవలం తెలంగాణ కోసమే రాలేదని వారు అన్నారు. శంషాబాదులోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నిర్మాణం కేవలం తెలంగాణ నేతల డబ్బులతో జరగలేదని వారు విమర్శించారు. రాష్ట్ర విభజనకు కేంద్రం అననుకూలం అని తేలిందన్నారు.
సమైక్యాంధ్ర కోసం బంద్
సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో బందు కొనసాగుతోంది. దుకాణాలు, కార్యాలయాలను ప్రజలు స్వచ్చంధంగా మూసివేశారు. సమైక్యాంధ్రవాదులు ర్యాలీలు చేపట్టారు.