తెలంగాణ10జన్పథ్: నేతలతో సోనియా తర్జన భర్జన
ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై ప్రకటన చేయాల్సి ఉంది. మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో సోనియా పరిస్థితి పైన, ప్రకటన పైన నేతలతో చర్చిస్తున్నారు. షిండే, ఇతర నేతలు తెలంగాణ, సీమాంధ్ర నేతలు పర్యటనల వివరాలను, వారు అందించిన సమాచారాన్ని సోనియా చేతికి అందించినట్లుగా చెబుతున్నారు.
వారి వారి అభిప్రాయాలు, డిమాండ్లు, తెలంగాణ ఇస్తే ఏమవుతుంది? ఇవ్వకుంటే ఏం జరుగనుంది? తదితర అంశాలపై చర్చిస్తారని అంటున్నారు. తెలంగాణపై 10 జన్పథ్లో ఇదే ఆఖరు సమావేశం అని చెబుతున్నారు. తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకోనున్న సమయంలో సీనియర్లతో సోనియా మథనం చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి పిలుపు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. గురువారం నాడు తమకు అందుబాటులో ఉండాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీకి చేరుకున్నారు. ఆజాద్ నుండి ముఖ్యమంత్రికి రెండుమూడుసార్లు ఫోన్ వచ్చింది. రేపటిలోగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
సోనియా ఇంటికి మంత్రి కన్నా
మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి వచ్చారు. ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సోనియా ఇంటికి వచ్చారు.
దిగ్విజయ్ వద్ద తెలంగాణ నేతలకు చుక్కెదురు
తెలంగాణ ప్రాంత మంత్రులు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన తనకు ఏం సంబంధమని ఎదురు ప్రశ్నించారు. తాను ఎపి ఇంచార్జిని కాదని, ఏదైనా ఉంటే వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్కు చెప్పాలని సూచించారు. ఆ తర్వాత వారు మోతీలాల్ వోరా, జనార్దన్ ద్వివేదిలకు వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు సీమాంధ్ర నేతలు రాహుల్ గాంధీ, చిదంబరం, ఆంటోనీల అపాయింటుమెంట్ల కోసం ఎదురు చూస్తున్నారు.