ఇద్దరు మంత్రుల రాజీనామా: షెట్టార్కు యడ్డీ అల్టిమేటం
కాగా ఇటీవల యడ్యూరప్ప.. జగదీష్ శెట్టార్ ప్రభుత్వంపై యు టర్న్ తీసుకున్నట్లుగా కనిపించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు అతను శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు పలువురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు, బహిరంగ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా యడ్యూరప్ప వారం రోజుల క్రితం బిజెపి ప్రభుత్వాన్ని కూల్చే విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపించారు. నాలుగు నెలల్లో ఎలాగూ బిజెపి ప్రభుత్వం గడువు తీరుతుందని, ఇప్పుడు ఆ శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చి ఆ నిందను తనపై వేసుకోవడం ఎందుకంటూ యడ్యూరప్ప వెనక్కి తగ్గారు.
ఇటీవల ఆయన బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. బిజెపి ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ఆసాధ్యమన్నారు. నాలుగు నెలల ఆయుష్షున్న ఈ ప్రభుత్వాన్ని కూల్చడం ఎందుకన్నారు. ఆ నిందను తాను ఎందుకు మోయాలన్నారు. మరోవైపు ఇతర పార్టీలలోకి వెళ్లాలని భావిస్తున్న పలువురు బిజెపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మౌలిక సదుపాయాల కల్పన పేరుతో శెట్టార్ భారీగా నిధులు కేటాయిస్తున్నారు.
దీంతో బిజెపిని వీడి.. యడ్డీ పార్టీలో చేరి.. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలు ఇష్టం చూపడం లేదనే వాదన వినిపించింది. ఈ విషయాన్ని ఆయన మద్దతుదారులు యడ్యూరప్పకు తేల్చి చెప్పారట. దీంతో అతను వెనక్కి తగ్గారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో యడ్డీ వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.
యడ్డీ అల్టిమేటం
జగదీష్ షెట్టార్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని యడ్యూరప్ప బుధవారం అన్నారు. ఆయన వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరింప చేస్తానని హెచ్చరించారు.