ఆజాద్కు రేణుకా చౌదరి బాసట: మోత్కుపల్లి ఫైర్
ఎన్ని రోజులైతే నెల అవుతుందో ఆజాద్ చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆజాద్ ప్రకటనతో ఎవరి రంగు ఏమిటో అర్థం చేసుకోవాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. కాంగ్రెసు మోసానికి మరో పేరు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు తెలంగాణ ప్రజల గుండెలపై తన్నిందని అన్నారు. కాంగ్రెసును విశ్వసించడం పెద్ద తప్పు అని, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు ఏకం కావాలని అన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఫామ్హౌస్లో కూర్చుని మీడియాతో మాట్లాడితే తెలంగాణ రాదని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు కలిసికట్టుగా ఉమ్మడి పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఆలస్యం కావచ్చు గానీ తెలంగాణ రాష్ట్రం రావడం ఖాయమని తెలుగదేశం తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన లాభనష్టాలను బేరీజు వేసుకుంటోందని ఆయన అన్నారు.
గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ఆజాద్ రాష్ట్ర ప్రజలను వెర్రివాళ్లుగా, తెలివితక్కువ వారిగా భావిస్తున్నారని ఆయన గురువారం అన్నారు. వారానికి, నెలకు ఎన్ని రోజులో ఆజాద్ చెప్తే తెలుసుకుంటామని ఆయన అన్నారు.
గతంలో మాదిరిగా మళ్లీ వెనక్కి వెళ్లి ద్రోహం చేయడం క్షమించరానిదని ఆయన అన్నారు. స్పష్టమైన ప్రకటన కోసం తెలంగాణ, సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేయాలని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో అనిశ్చితి నెలకొని అభివృద్ధి వెనకబడి పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధపడిందని విమర్శించారు. అందువల్ల కాంగ్రెసు పార్టీనే నాశనం చేయడానికి ప్రజలు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఇప్పటికైనా తమ బాధ్యత తెలుసుకుని వ్యవహరిస్తారా, ఢిల్లీలో అధిష్టానం చుట్టే ప్రదక్షిణలు చేస్తారా తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.