ఇవ్వమంటే చెప్పండి: అధిష్టానంపై తెలంగాణ నేతల ఫైర్
ఆజాద్ వ్యాఖ్యలు సరికావన్నారు. విభజనపై వెనక్కి తిరిగి చూడలేనంత దూరం వెళ్లామని అన్నారు. తెలంగాణపై ప్రకటనను అడ్డుకునేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆజాద్ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి నష్టం చేకూర్చుతాయని అన్నారు. తెలంగాణ సాధన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తమ పార్టీ నేతలు భేటీ అవుతున్నారన్నారు.
తెలంగాణ కోసం కెసిఆర్, జెఏసి నేతలు ఇలా ఎవరినైనా తాము కలుస్తామన్నారు. ప్రస్తుతం తెరాసలో చేరే పరిస్థితి లేదన్నారు. అందరం చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయించుకుంటామన్నారు. తెలంగాణ ఇవ్వమని కాంగ్రెసు పార్టీ, కేంద్రం చెబితే తాము తమ పదవులకు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ స్వంత ప్రయోజనాల కోసమే రాజీనామాలకు సిద్ధపడుతున్నారన్నారు.
ఆజాద్ చెప్పినట్లుగా కాకుండా కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట ఇచ్చినట్లుగా ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూల ప్రకటన రాకుంటే ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకైనా తాము వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. పార్టీని వీడే పరిస్థితి వస్తే మాత్రం అందరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందన్నారు. కానీ ఆజాద్ వ్యాఖ్యలు సరికావన్నారు. ఇంకొంతకాలం అంటే ఎంతకాలమో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తమను ముందుండి నడిపించాలని వారు అన్నారు.