తెలంగాణపై రాజీనామాలకు తెలంగాణ ఎంపీలు రెడీ
అయితే, తెలంగాణపై ప్రకటన చేసేందుకు వారు పది రోజుల సమయం ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి మధు యాష్కీ రాకపోవడంతో రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడుతామని సమావేశానంతరం కె. కేశవ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ కోసం ఏ పార్టీలోనైనా కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. 28వ తేదీన ప్రకటన రాకపోతే తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.
బస్సుల్లో ప్రజలను తీసుకుని వచ్చి సభలు పెట్టాల్సిన గతి తమకు పట్టలేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర సభలో పాల్గొనే హక్కు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఉందని, బొత్సను తెలంగాణకు అనుకూలంగా తాను తీసుకుని వస్తానని ఆయన అన్నారు. తెలంగాణ వస్తుందని భయపడి సీమాంధ్ర నాయకులు ఒక్కటయ్యారని ఆయన అన్నారు. తెలంగాణ నాయకుల్లో ఐక్యత ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల్లో ఉంటే, సమైక్యవాదం నేతల్లో మాత్రమే ఉందని కెకె అన్నారు.
తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వ్యంగ్యంగా మాట్లాడడం బాధ కలిగించిందని మందా జగన్నాథం అన్నారు. దళితుడైన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తేల్చకపోవడంతో కాంగ్రెసు ప్రతిష్ట దిగజారుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఎంపిలు కట్టుబడి ఉన్నారని ఎంపి వివేక్ అన్నారు. ఎన్ని శక్తులు తెలంగాణకు అడ్డువచ్చినా దీటుగా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర సమావేశానికి బొత్స వెళ్లడం బాధాకరమని, అందుకు బొత్స వివరణ ఇవ్వాలని పొన్నం ప్రభాకర్ అన్నారు.