కెవిపికి ఆ రెండే తెలుసు, రౌడీషీట్ తెరవాలి: కోదండరామ్
ప్రేమను నిరాకరించిన యువతిపై యాసిడ్ దాడికి పాల్పడటం ఎంతటి దుర్మార్గమో బలవంతంగా సమైక్యాంధ్రలో కలిసి ఉండాలని చెప్పడమూ అంతే దుర్మార్గమని కోదండరామ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు వ్యతిరేకంగా గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారులతో కలిసి ఢిల్లీలో చక్రం తిప్పిన కెవిపిని సహించే ప్రసక్తే లేదన్నారు. కెవిపి నాయకుడిగా రెండే రెండు పనులు చేసినట్లు కనిపిస్తోందన్నారు.
ఒకటి జలయజ్ఞం పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం, రెండోది తెలంగాణ అంశం నిర్ణయం తీసుకునే దశకు కేంద్రం వచ్చే సమయంలో సీమాంద్రులను ఏకం చేసి అడ్డుకోవడమేనని విమర్శించారు. ఉద్యమంలో పాల్గొన్న కెయు విద్యార్థులపై రౌడీషీట్ తెరవడం ప్రజా వ్యతిరేకమన్నారు. ఆ పని పోలీసులు నిజంగా చేయాలనుకుంటే కెవిపిపై రౌడీషీట్ తెరవాలన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పిన మాటలను ఎందరు రాజకీయ నాయకులు పాటిస్తున్నారో చెప్పాలన్నారు.
అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలు సోనియా, రాహుల్కు కనిపించలేదా అని కోదండరాం నిలదీశారు. హెదరాబాద్లో సీమాంధ్ర నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకుంటే అది ఎలా సమైక్యాంధ్ర సదస్సు అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ మార్గం ఎటువైపో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.