ముంబై దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్లు జైలు
డేవిడ్ హెడ్లీపై కేసులో న్యాయమూర్తి హారీ డీ లీనెన్వెబర్ గురువారం తీర్పును వెలువరించారు. అతడు నేరం చేశాడని, ఉగ్రవాదులకు సహకరించాడని, అందుకు ప్రతిఫలం కూడా పొందాడని న్యాయమూర్తి అన్నారు. తాను మారానని హెడ్లీ చెబుతున్నాడని, కానీ, అతని మాటలపై తనకు విశ్వాసం లేదని, హెడ్లీ నుంచి ప్రజలను కాపాడడం తన బాధ్యత అని, భవిష్యత్తులో మరిన్ని ఉగ్రవాద దాడులకు పాల్పడకుండా అతనిని నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెడ్లీకి 35ఏళ్ల శిక్ష విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని, అది సరైన శిక్ష కాదు. కానీ, ప్రభు త్వ ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని న్యాయమూర్తి తన తీర్పులో అన్నారు.
హెడ్లీకి 12 అభియోగాల కింద శిక్ష విధించారు. హెడ్లీ విజ్ఞప్తి మేరకు మరణ శిక్ష విధించాలనే ప్రతిపాదనను ముందే పక్కనపెట్టారు. లష్కరే తాయిబాకు సహకరించడం, కోపెన్హాగన్లోని డానిష్ దినపత్రికపై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచించినందుకు వారం రోజుల కిందట హెడ్లీ బాల్య స్నేహితుడు తహావ్వుర్ రాణాకు న్యాయమూర్తి 14ఏళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ అమెరికన్ అయిన హెడ్లీ చిన్నసైజు నార్కోటిక్స్ వ్యాపారి. ఆ తర్వాత అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి ఇన్ఫార్మర్గా కూడా పని చేశాడు. విచారణ సందర్భంగా హెడ్లీకి 30-35 ఏళ్ల శిక్ష విధించాలని అటార్నీ జనరల్ డేనియల్ జే కలిన్స్ వాదిస్తే, లష్కరే తాయిబా, ఇతర ఉగ్రవాదులకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి హెడ్లీ కీలకమైన సమాచారాన్ని అందించాడని, దానిని దృష్టిలో పెట్టుకుని అయినా అతనికి తక్కువ శిక్షతో సరిపెట్టాలని హెడ్లీ తరఫు న్యాయవాది వాదించారు. ముంబై దాడుల కేసుకు సంబంధించి హెడ్లీ, రాణాలను 2009లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.