కిస్ నైట్క్లబ్లో ఘోర అగ్నిప్రమాదం: 245మంది మృతి
సాంటామారియా: బ్రెజిల్లోని ఓ నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 245 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ పేరు కిస్. శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు దక్షిణ బ్రెజిల్లోని శాంటామారియా నగరంలోని కిస్ నైట్ క్లబ్బులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఇవి వ్యాపించాయి. ఈ సమయంలో క్లబ్బులో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన 400 మంది విద్యార్థులు ఉన్నారు.
మంటలు వెలువడటంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ద్వారం ఎటు ఉందో గుర్తించలేక పోయారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఉక్కిరిబిక్కిరి అయి ఊపిరి అందక పలువురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. షో కోసం వెలిగించిన నిప్పు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వేగంగా మంటలు అలుముకోవడం, నల్లటి పొగలు ఆ వెనువెంటనే చుట్టుముట్టడంతో 245 మందికి పైగా ప్రాణాలు పోయాయి. షోలో భాగంగా బ్యాండ్ బృందం స్టేజీపై నిప్పు వెలిగించే ప్రయత్నంలోనే ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఈ సమయంలో యూనివర్సిటీకి చెందిన విద్యార్థులతో పాటు క్లబ్లో 500 మంది దాకా ఉన్నారు. ఇప్పటిదాకా 180 మృతదేహాలను పోలీసులు గుర్తించా రు. దట్టమైన మంటలు, పొగలతో కమురుకుపోయిన క్లబ్ భవంతి నుంచి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. క్లబ్లో మంటలు అలుముకోగానే భయంతో బయటకు పరిగెత్తే ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు. క్లబ్లో అత్యవసర ద్వారం సకాలంలో తెరుచుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్నారు.
ఆ ద్వారాలను రక్షణ బృందాలు బద్దలు కొట్టి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాయి. నాలుగైదు గంటలపాటు కష్టపడి అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రధాన ద్వారానికి దగ్గర్లోని విఐపి గదిలో ఉన్నవారు మాత్రమే అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోగలిగారు. విషయం తెలిసిన వెంటనే అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ చిలీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. బ్రెజిల్ దేశంలో ఈ ప్రమాదం రెండో అతిపెద్దది. 1961లో రియో స్టేట్లో జరిగిన ఓ సర్కస్ ప్రమాదంలో దాదాపు 503 మంది చనిపోయారు.
కాగా మరో ఏడాదిలో బ్రెబిల్లో అంతర్జాతీయ సాకర్ పోటీలు జరగాల్సి ఉంది. తాజా దుర్ఘటన ప్రభావం ఆ పోటీల నిర్వహణపై పడొచ్చునని అధికారులు ఆందోళన చెందుతున్నారు. విఐపిలు తరచూ సందర్శించే కిస్ నైట్క్లబ్ లాంటి వాటిలోనే అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే ఏ వ్యవస్థా లేకపోవడంతో సాకర్ సభ్య దేశాలు తమ క్రీడాకారులను పంపే విషయంలో పునరాలోచించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.