అధిష్టానం రాజీనామాలు వద్దంది, మంత్రులూ: రాజయ్య
తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు కూడా భవిష్యత్తులో తమ దారిలో నడుస్తారని ఆయన చెప్పారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ జై ఆంధ్రప్రదేశ్ సభలో తమపై దుష్ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోనందున రాజీనామా చేస్తామని తెలంగాణ ప్రాంత ఎంపీలు సోమవారం చెప్పారు. ఈ నేపథ్యంలో రాజీనామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మంగళవారం ఉదయం ఎంపీలు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఇంట్లో భేటీ అయ్యారు. భేటీకి వచ్చిన ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణపై ఎంపీలు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని తాను మొదటి నుండి చెబుతున్నానని అన్నారు. మంత్రులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాచిరంపాన పెడుతుందన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల పైన స్పందించేందుకు నిరాకరించారు.
జెఎన్టియులో ఆందోళన
తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రత్యేక రాష్ట్రం కోసం వెంటనే రాజీనామా చేయాలని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జెఎన్టియు)లో ఆందోళన చేపట్టారు.