పిక్చర్స్: కెసిఆర్ టార్గెట్గా ఈ సీమాంధ్ర నేతలంతా..
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై సున్నితంగా మాట్లాడుతూనే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సీమాంధ్ర నాయకులు లక్ష్యంగా చేసుకుని విమర్ననాస్త్రాలు సంధిస్తున్నారు. కెసిఆర్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి సీమాంధ్ర నాయకులు పలు విధాలుగా వాగ్బాణాలు సంధిస్తున్నారు. రాజమండ్రి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా కెసిఆర్ ప్రత్యర్థుల్లో చేరారు. రాజమండ్రిలో నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో కెసిఆర్పై ఆయన దూకుడుగా వ్యవహరించారు.
కెసిఆర్ వాడుతున్న పదజాలంపై ప్రధానంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలంగాణ సమరదీక్షలో కెసిఆర్ వాడిన పదజాలంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చప్రాసికి ఉన్న తెలివి కూడా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు లేదని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుపైనే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి రాజకీయ నాయకత్వాన్ని అందిస్తున్న తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును లక్ష్యంగా చేసుకుని సీమాంధ్ర నాయకులు మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆయన భాష మీదనే వారు ఎక్కువగా ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా, మరోసారి ఆ వాగ్యుద్ధానికి ఆయన తెర తీశారు. తెలంగాణ సమరదీక్షలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదం నడుస్తోంది.
తెలంగాణను వ్యతిరేకించే సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు ఇటీవలి దాకా నాయకత్వం వహిస్తూ వచ్చారు. తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అలిగి అధిష్టానం పెద్దలకు వెళ్లడం మానేశారు. తన పదవికి రాజీనామా పత్రం కూడా ఇచ్చారు. మొదటి నుంచీ ఆయన కెసిఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.
కావూరి అధిష్టానం పెద్దలకు దూరమైన ప్రస్తుత స్థితిలో ఆయన స్థానాన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు భర్తీ చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా కెవిపి సీమాంధ్ర నాయకులకు నాయకత్వం వహిస్తున్నారు. దీంతో ఆయన తెలంగాణ నాయకులకు లక్ష్యంగా మారారు. కెసిఆర్పై ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మాత్రం లేవు. కానీ టార్గెట్ కెసిఆర్ అని అంటారు.
కాంగ్రెసు అధిష్టానంపై గతంలో అలిగిన గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఇప్పుడు పూర్తి విధేయత ప్రదర్శిస్తున్నారు. సోనియా గాంధీపై వ్యాఖ్యలు చేసిన కెసిఆర్పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బూతులు తమకూ వచ్చునని, కానీ సభ్యత కాదని తిట్టడం లేదని ఆయన కెసిఆర్పై విరుచుకు పడ్డారు. కెసిఆర్ను దెబ్బ తీస్తే తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.
కెసిఆర్పై మొదటి సైద్దాంతిక యుద్ధం చేస్తున్నానని అనుకుంటున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో లగడపాటి రాజగోపాల్ ఒకరు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన పలు సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు తయారు చేసి చెబుతుంటారు. తాజాగా, ఆయన కెసిఆర్కు హైదరాబాదులో పోటీ చేయాలని సవాల్ విసిరారు. మొదటి నుంచీ లగడపాటి టార్గెట్ కెసిఆర్, తెరాసనే.
కెసిఆర్కు పాఠం చెప్పడానికి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సిద్ధమయ్యారు. రాజమండ్రిలో జై ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించినప్పటి నుంచి ఆయన కెసిఆర్ను లక్ష్యంగా చేసుకుని సమరం సాగిస్తున్నారు. కెసిఆర్ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. కెసిఆర్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేతల్లో ఉండవల్లి కూడా చేరిపోయారు.
ఆంధ్రజ్యోతి దినపత్రిక కెసిఆర్ వాడిన పదజాలం జాబితాను కూడా ఇచ్చింది. సన్నాసి, తుక్కు వంటి పదాలు కెసిఆర్ ప్రసంగంలో దొర్లాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకుని సమరాన్ని సాగించిన కెసిఆర్ తాజాగా కాంగ్రెసును లక్ష్యం చేసుకున్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద 36 గంటల పాటు జరిగిన తెలంగాణ సమరదీక్షలో కెసిఆర్ ప్రధానంగా కాంగ్రెసు పార్టీపైనే విరుచుకుపడ్డారు. సోనియా గాంధీ రాచి రంపాన పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే, కాంగ్రెసు పార్టీ నాయకులు కెసిఆర్ను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు.
తెలంగాణలో జరుగుతున్న అత్మహత్యలకు కెసిఆర్ను బాధ్యుడిగా చెబుతూ సీమాంధ్ర నాయకులు విమర్శలు చేస్తున్నారు. కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాల వల్లనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని అంటూనే కెసిఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించారా అని అడుగుతున్నారు. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివ రావు వంటి నాయకులు కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా కెసిఆర్ అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్నారు.