పదో తరగతి వరకు తెలుగు, ఆంగ్లం తప్పనిసరి
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ప్రకటన జారీ చేసింది. రాష్ట్రానికి చెందిన వారైనా, ఇతర రాష్ట్రాల వారైనా విద్యార్థులు తెలుగు, ఆంగ్లం భాషలను పదో తరగతి వరకు ఎంచుకోవాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఆయా పాఠశాలల్లో పదో తరగతి వరకూ చదువుతున్న 1.29 కోట్ల మంది విద్యార్థులకూ ఈ నిబంధన వర్తిస్తుందన్న మాట. వచ్చే విద్యాసంవత్సరం (2013-14) నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
యాక్టు 1/82కు లోబడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 86కు అనుగుణంగా అమల్లో ఉన్న త్రిభాషా సూత్రం ప్రకారం.. రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులు మాత్రమే తెలుగు, ఆంగ్ల భాషలు విధిగా చదవాలి. అయితే తెలుగు మాతృ భాష కాని వారికి ఇందులో మినహాయింపు ఉంది. తమిళనాడు, కర్ణాటకల్లో చదివే విద్యార్థులందరూ అక్కడి మాతృభాషలు చదవాల్సిందేనని ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ తప్పనిసరి చేశాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి నుండి ఐదో తరగతి వరకు మాత్రమే తెలుగు మాధ్య పాఠశాలల్లో తెలుగులోనే బోధన జరుగుతోంది. ఇథర పాఠశాలల్లో విద్యార్థుల మాతృభాషను అనుసరించి తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరు నుండి పది వరకు తెలుగును ప్రథమ లేదా ద్వితీయ భాష కింద తీసుకున్నారు. తాజాగా తెలుగుకు ప్రాధాన్యం పెరిగేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి అందరూ తెలుగును తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇటీవలి ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ అంశంపై చర్చించి ప్రతి విద్యార్థీ తెలుగు, ఆంగ్ల భాషలను తప్పనిసరిగా చదివేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.