రమ్మంటే.: కెజెపి స్థాపకుడికి యడ్డీ షాక్, రిజైన్ల పరంపర
ఆయన తీరుతో షాక్కు గురైన యడ్డీ అతనికే తిరిగి ఝలక్ ఇచ్చారు. తనను అధ్యక్ష పదవి నుండి తొలగించే అర్హత ప్రసన్నకు లేదని, పార్టీపై పూర్తి హక్కులు తనకు ఉన్నాయని చెబుతూ అతనిని పార్టీ నుండి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రసన్న ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. చట్టరీత్యా తనకు పార్టీపై అధికారం ఉందన్నారు. దీనిపై పోరాటానికి ప్రసన్న కుమార్ సిద్ధమయ్యారు.
ఇబ్బందుల్లో శెట్టార్ ప్రభుత్వం
జగదీష్ శెట్టార్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. యడ్యూరప్పకు వర్గానికి చెందిన 13 మంది బిజెపి ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు మంగళవారం రాజీనామాలు చేశారు. స్పీకర్ చాంబర్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం వారి రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కెజి బోపయ్య మంగళవారం రాత్రి ప్రకటించారు. అంతకుముందు ఒక్క చెళ్లకెరె ఎమ్మెల్యే తిప్పేస్వామి రాజీనామాను మాత్రమే స్పీకర్ ఆమోదించడం రాజకీయ వేడి పుట్టించింది.
మిగిలిన 12 మందిని అనర్హులుగా ప్రకటించాలంటూ బిజెపి శాసనసభ్యుల ప్రతినిధివర్గం ఇచ్చిన ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ అభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే, వారి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటానని బోపయ్య ప్రకటించారు. అంతవరకు రాజీనామాలను ఆమోదించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. స్పీకర్ ఒక్కరి రాజీనామానే ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆయన చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బైఠాయించారు.
రాత్రంతా అక్కడే ఉండేందుకు వీలుగా దుప్పట్లు కూడా తెచ్చుకున్నారు. మిగతా 12 మంది రాజీనామాలను సమర్పించినట్టు శాసనసభా వర్గాల నుంచి సమాచారం అందడటంతో వారంతా శాంతించారు. దీంతో శెట్టర్ సర్కారు మైనారిటీలో పడిపోయింది. 224 సభ్యుల శాసనసభలో 13 మంది రాజీనామాలతో (యడ్యూరప్ప, శ్రీనివాస పూజారి ఇప్పటికే రాజీనామాలు చేశారు) సభ్యుల సంఖ్య 209కి చేరుకుంది.
అందులో బిజెపికి 105, కాంగ్రెస్ 71, జెడిఎస్కి 26, స్వతంత్రులు ఆరుగురు, బిఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. మరో ఏడుగురు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. అదే జరిగితే శెట్టార్ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకున్నట్లే. కాంగ్రెసు, జెడిఎస్లకు కలిపి 97 మంది శాసనసభ్యులు ఉన్నారు.