తెలంగాణపై స్పష్టం: వాయలార్, తేల్చండి: హోంతో వివేక్
త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇతర సీనియర్ నేతలతో తెలంగాణ విషయమై మాట్లాడతామని చెప్పారు. సంప్రదింపుల తేదిలను కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ను అడగాలని తెలంగాణ ఎంపీలకు సూచించారు. ఆయనే ఇంఛార్జ్ కాబట్టి ఆయనే చెబుతారన్నారు. కాంగ్రెసు పార్టీ వైఖరిని చాకో స్పష్టం చేశారన్నారు.
ఐక్యంగా ఉన్నాం: వివేక్
తమ పార్టీ సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల కంటే తామే ఐక్యంగా ఉన్నామని కాంగ్రెసు పార్టీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ శుక్రవారం అన్నారు. ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, యువత ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తాను షిండే దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.
తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని తాను షిండేను కోరానని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీలం అందరం తెలంగాణ విషయంలో ఐక్యంగా ఉన్నామన్నారు. మనస్పర్థలు సహజమే అన్నారు. మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు అరెస్టు దారుణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పోలీసుల జూలుం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర రావు వ్యవహారం తాను షిండే దృష్టికి తీసుకు వెళ్లానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్రానికి జాతీయవ్యాప్తంగా మద్దతు పెరుగుతోందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. వెంటనే కేంద్రం ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలన్నారు.
పవార్ మద్దతు పలికారు.. వస్తుంది
నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు పలుకుతున్నారని.. ఆయన తీరే కేంద్రం తెలంగాణ ఇస్తుందనడానికి నిదర్శనం అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాదులో అన్నారు.