వైయస్ను చూసి లాగులు తడుపుకున్నారు: యాష్కీ
రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుందా, తెరాసలో చేరుతురా, ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా అని ఇతర తెలంగాణ కాంగ్రెసు ఎంపీలను అడుగుతూ మళ్లీ ఎన్నికై ఎంపిలుగానే వస్తారు కదా, అప్పుడు రాష్ట్రం ఏర్పాటవుతుందా అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాను రాజీనామా చేస్తానని, ప్రజల కోసం తల నరుక్కుంటానని ఆయన అన్నారు.
రాజీనామాల వెనుక తెరాస ఒత్తిడి ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, ఆ విషయాన్ని తన సహచరులే చెప్పాలన్నారు. "రాజీనామాలు సమష్టి నిర్ణయమే. నేను కూడా సంతకం చేశాను. అయితే, అందరం కలిసి వచ్చి సోనియాకు లేఖలు ఇవ్వాల్సి ఉంది. నాకు చెప్పకుండా, చాటుగా ఆరుగురు మాట్లాడుకుని ఎందుకు పంపించారు? ఎవరి ద్వారా ఇచ్చారు? ఎవరి ఒత్తిడితో మీరు ఇవ్వాల్సి వచ్చింది?' అని తన సహచరులను ప్రశ్నించారు.
ధిక్కార ధోరణిలో కాకుండా పరిస్థితులు వివరించే రీతిలో మేడమ్ను కలిసి రాజీనామాలు ఇవ్వాలని భావించామన్నారు. తన రాజీనామాతో రాష్ట్రం ఏర్పడుతుందంటే తక్షణం ఇచ్చేస్తానని, మళ్లీ పార్లమెంటుకు కూడా వెళ్లనని స్పష్టం చేశారు. 'నేను వాళ్ల పార్టీలోకి వెళ్లడంలేదు. వాళ్ల టికెట్ అడగటం లేదు. ఎన్నికలు ఆశించడం లేదు. కాబట్టే ఆ పార్టీ ఏ విధంగా బదనాం చేయాలా అని ఆలోచిస్తోంది' అని అంటూ పరోక్షంగా తెరాసను విమర్శించారు.
రాజీనామాలే ముఖ్యమనుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కలిసి రాజీనామా చేయాలని, అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్లకుండా రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని యాష్కీ అన్నారు. గతంలో పలువురు రాజీనామాలు చేస్తే ఏం జరిగిందని ప్రశ్నించారు. 'ఒక పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 10 నుంచి 18కి పెరిగింది. మంత్రులు రాజీనామాలు చేశారు. రాష్ట్రం ఏర్పడలేదు' అన్నారు. 'తెలంగాణ ఏర్పాటుపై నా మిత్రులతో విభేదం లేదు గానీ నడిచే పద్దతిలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి' అని యాష్కీ చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు ఖాయమని, అది ఎలా ఏర్పాటు చేయాలన్న అంశంపైనే అధిష్ఠానం ఆలోచిస్తోందని యాష్కీ తెలిపారు. అత్యున్నత స్థాయిలో తెలంగాణ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని, రాజీనామాల వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని వయలార్ అన్నట్లు ఆయన తెలిపారు.