'ఒత్తిడిలో శంకర రావు': అరెస్ట్ మిస్ ఫైర్ అయిందా?
హెల్త్ బులెటిన్
శంకర రావు ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారని, మానసిక ఒత్తిడికి లోనయ్యారని, బైపాస్ సర్జరీ జరగడం వల్ల ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం బిపి, షుగర్ లెవల్స్ సాధారణంగా లేవన్నారు.
అరెస్ట్ మిస్ ఫైర్ అయిందా?
కాగా శంకర రావు అరెస్టు మిస్ ఫైర్ అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో శంకర రావు పైన ఆరోపణలు ఉన్నాయి. శంకర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రివర్గంలోని పలువురు నేతలు తదితరులు ఎందరినో టార్గెట్ చేసుకొని నిప్పులు చెరుగుతుండేవారు. కిరణ్ను నిత్యం విమర్శించడం వల్ల ఆయనను మంత్రి పదవి నుండి కూడా తొలగించారు. ఎప్పుడు ముఖ్యులను టార్గెట్ చేసుకున్న కారణంగానే ఆయనను అరెస్టు చేశారని అంటున్నారు.
అయితే ఆయన అరెస్టుపై తీవ్రమైన నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా యుద్ద నౌక గద్దర్ నుండి మొదలుకొని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వరకు అందరూ శంకర రావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. శంకర రావు బావమరిది, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ అయితే అరెస్టు వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.
దళిత సంఘాలు మండిపడ్డాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్లు కూడా అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత నేతను అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడుతున్నందునే శంకర రావును అరెస్టు చేశారని దళిత సంఘాలు మండిపడ్డాయి. దీంతో పెద్దలు వెనక్కి తగ్గారని అంటున్నారు. అందుకే శంకర రావును అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత మాట మార్చి కేవలం విచారణకే తీసుకు వెళ్లామని చెప్పి ఉంటారని అంటున్నారు.