తెలంగాణ: దులిపేసుకున్న కాంగ్రెస్, ఆజాద్ నెత్తిన భారం
కాంగ్రెసు పార్టీ వైఖరిని కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధి పిసి చాకో రెండు రోజుల క్రితం చెప్పారు. శుక్రవారం వాయలార్ రవి మాట్లాడుతూ.. తెలంగాణపై కాంగ్రెసు వైఖరి స్పష్టంగా ఉందని, పిసి చాకో ఇప్పటికే పార్టీ వైఖరిని చెప్పారన్నారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలమని ఆయన ప్రకటించారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరి ప్రకటించామని చెబుతూనే మిగిలిన కాంగ్రెసు పెద్దలు భారాన్ని ఆజాద్ పైన వేస్తున్నారు.
సోనియా అభిప్రాయమే కాంగ్రెసు నిర్ణయంగా వెలువడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సోనియా తెలంగాణకు ఓకే చెప్పినందు వల్లే చాకో తెలంగాణకు అనుకూలమనే ప్రకటన చేశారని గట్టిగానే నమ్మవచ్చు. అయితే ఈ సున్నిత అంశాన్ని ఎలా తేల్చాలి? ప్రకటన ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి? తదితర అంశాలను మాత్రం సోనియా ఆజాద్కే వదిలేశారని అంటున్నారు. మిగిలిన నేతల ప్రకటనలు అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
పది రోజుల క్రితం తెలంగాణ మంత్రులు దిగ్విజయ్ సింగ్ను కలిశారు. తనను కలిసిన మంత్రులతో.. తాను పార్టీ రాష్ట్ర ఇంచార్జిని కాదని, ఆజాద్ను కలవాలని సూచించారు. తమను కలిసిన సీమాంధ్ర, తెలంగాణ నేతలకు ఇతర ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు కూడా అదే విషయం చెప్పారట. తెలంగాణ పైన పరిష్కారం కోసం ఆజాద్నే కలవాలని సూచించారట. ఈ రోజు(శుక్రవారం) వాయలార్ కూడా అదే విషయం చెప్పారు.
తెలంగాణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెబుతూనే ఎప్పుడూ పూర్తవుతాయో, తేదీలు ఎప్పుడు నిర్ణయిస్తారో మాత్రం ఆజాద్ను అడగమని సూచిస్తున్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై నెల రోజులు గడువు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన గడువు వాయిదా పడటం వెనుక కూడా ఆజాద్ ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెసు పెద్దలు అందరూ తెలంగాణ అంశాన్ని ఆజాద్ నెత్తిన వేస్తుండటంతో ఆయన ఏం చేస్తారు? ఎప్పుడు నిర్ణయిస్తారు? అనే అంశాలపై రాష్ట్ర కాంగ్రెసులో చర్చనీయాంశమైంది. కాంగ్రెసు పార్టీ వైఖరి తేలినా కేంద్రం నిర్ణయం వెలువడాలంటే ఆజాద్ మొదట ఓ స్పష్టతకు రావాల్సిందేనని అంటున్నారు.