బాబువి ఉత్తుత్తి ప్రకటనలేనా, మాటలొద్దు: మైసురా
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనారిటీలో పడినా చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. కాంగ్రెసు ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తూ ఉంటే చంద్రబాబు ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తమకు తగిన సంఖ్యాబలం లేదని, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇస్తామని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు నిజమైతే మైనారిటీలో పడినట్లేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడదు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నుంచి బహిష్కరించామని చెబుతున్న 9 మంది శాసనసభ్యుల పేరలు చెప్పే స్థితిలో కూడా బొత్స లేరని ఆయన వ్యాఖ్యానించారు.
బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అడగాలని, ఆ బాధ్యత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఉందని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తమ పార్టీ ప్రయోజనం పొందుతుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన అన్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు శాసనసభ్యుడు జోగి రమేష్పై పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వర రావు శనివారంనాడు విరుచుకుపడ్డారు. పార్టీ మారాలనే ఉద్దేశంతోనే బొత్సపై జోగి రమేష్ విమర్శలు చేశారని ఆయన అన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన 9 మంది శాసనసభ్యుల పేర్లను బొత్స సత్యనారాయణ త్వరలోనే వెల్లడిస్తారని ఆయన చెప్పారు. జోగి రమేష్ వెనక ఉండి కథ నడిపిస్తున్నవారెవరో ముందుకు రావాలని ఆయన అన్నారు.