శంకరరావు ఘటనపై సిఐడి విచారణ: ఫ్యామిలీ విచారణ
విచారణ నిమిత్తం సిఐడి చీఫ్ కృష్ణ ప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగారు.శంకరరావుకు కేర్ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్యుల నుంచి సిఐడి అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. శంకరరావును అదుపులోకి తీసుకున్న తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ సభ్యులు కూడా పోలీసుల తీరును తప్పుపట్టారు.
ఇదిలావుంటే, కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర రావును పలువురు నేతల శనివారంనాడు పరామర్శించారు. మంత్రులు ప్రసాద్ కుమార్, రఘువీరా రెడ్డి, బిజెపి నేత సిహెచ్ విద్యాసాగర రావు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శంకరరావును కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు పరామర్శించారు. పోలీసుల తీరు తప్పుడు సంకేతాలను ఇస్తోందని ఆయన అన్నారు. దళితుల వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు.
గ్రీన్ఫీల్డ్ భూముల కుంభకోణం కేసులో పోలీసులు గురువారంనాడు శంకరరావును అదుపులోకి తీసుకున్నారు. దుస్తులు కూడా మార్చుకోనీయకుండా ఆయనను పోలీసులు తరలించారు. దీంతో దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో శంకరరావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాము శంకరరావును అరెస్టు చేయలేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కేర్ ఆస్పత్రిలో చేరారు.