బ్రదర్ అనిల్ ఆస్తులపై విచారణకు విహెచ్ డిమాండ్
అదేవిధంగా ఊగిసలాటలో ఉన్న అభ్యర్థుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెసు పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని బతికించుకునే బాధ్యత కార్యకర్తల పైనే ఉందన్నారు. పార్టీ జెండాలను మోసేవాళ్లకు అందలం ఎక్కించాలన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న వారిని తప్పించాలని విహెచ్ హితవు పలికారు.
తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు. కర్నాటక ఎన్నికల తర్వాత తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. జగన్ కోసం అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దొంగ సంతకాల సేకరణ చేసి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిందన్నారు. జగన్ కోసం కోటి సంతకాల సేకరణ కేవలం ప్రచారం కోసమే అన్నారు. ఆ సంతకాలతో ప్రణబ్ ముఖర్జీని ఆ పార్టీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసిందన్నారు.
బ్రదర్ అనిల్ కుమార్, షర్మిలల ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎంత దోచుకున్నారో బయటకు రావాలని విహెచ్ డిమాండ్ చేశారు. షర్మిల, జగన్ ఆస్తులపై కాంగ్రెసు ఊరురా ప్రచారం చేయాలన్నారు. 10 కంపెనీలలో బ్రదర్ అనిల్ కుమార్కు పెట్టుబడులు ఉన్నాయని, దోచుకున్నది కాక కాంగ్రెసు నేతలనే కించపర్చేలా వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అనిల్ కుమార్ ఆస్తుల పైన విచారణ జరిపించాలన్నారు. రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు వల్ల కాంగ్రెసు పార్టీకి ఎలాంటి లాభం లేదన్నారు. కెవిపి పని తీరు పైన పార్టీ అధిష్టానం ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కాంగ్రెసు పార్టీలోనే ఉండి పనులన్నీ చేయించుకుంటున్న నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తున్నారని ఆరోపించారు.