ఆధారాలున్నవి: శంకర్రావు కూతురుకు గ్రీన్ఫీల్డ్ విక్టిమ్స్
కాగా గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకర రావు కూతురు సుష్మిత ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. తన తండ్రిని అరెస్టు చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)చే విచారణ జరిపించాలని ఈ సందర్భంగా సుష్మిత డిమాండ్ చేశారు.
తన తండ్రిని ఎలాగైనా జైలుకు పంపించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పుడు తన తండ్రితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిఐడి విచారణకు ఆదేశించిందని కానీ, తాను సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తన తండ్రి 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయకుంటే ఎలా అని సుష్మిత ప్రశ్నించారు.
పోలీసులపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. కాగా గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో గత గురువారం సాయంత్రం పోలీసులు శంకర రావును అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దళిత సంఘాలు, మంత్రులు.. ఇలా పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవడంతో పోలీసులు తాము అతనిని అరెస్టు చేయలేదని విచారించేందుకు తీసుకు వెళ్లామని చెప్పారు. అనంతరం శంకర రావు అనారోగ్యానికి గురి కావడంతో పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు.