తెలంగాణపై సీరియస్: పెద్దలతో సిఎం భేటీలు ఖతం
మంగళవారంనాడు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశమయ్యారు. తెలంగాణ అంశం, రాజకీయ పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు నివేదికలు సమర్పించినట్లు చెబుతున్నారు. ప్రధానితో తెలంగాణపై ప్రధానంగా చర్చించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో గ్యాస్ కొరతను ఆయన దృష్టికి తెచ్చారు. రాష్ట్రానికి తగిన గ్యాస్ను అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవిని, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేలను ఆయన కలుసుకున్నారు. అలాగే, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ ఆయన సమావేశమైనట్లు తెలుస్తోంది. సోమవారంనాడు ఆయన సోనియా గాంధీతో, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో, కాంగ్రెసు సీనియర్ నేత మోతీలాల్ వోరాతో సమావేశమయ్యారు.
తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే విషయంపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి నుంచి సమాచారం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణపై ప్రత్యామ్నాయాలను తమ వద్దు ఉంచుకుని ముఖ్యమంత్రి నుంచి సమాచారం రాబట్టినట్లు చెబుతున్నారు. అయితే, తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకున్నా కాస్తా ముందుగా తనకు చెప్పాలని, అప్పుడే పరిస్థితులను అదుపు చేయగలుగుతామని ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారంనాడే ఢిల్లీకి చేరుకుంటారని భావించారు. కానీ, ఆయన రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర గవర్నర్ నరసిహన్ను ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పిలిచినట్లు తెలుస్తోంది. ఆనయ ఈ నెల 9వ తేదీన ఢిల్లీ పర్యటనకు వస్తారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించే సదస్సుకు హాజరవుతారు. ఈలోగా తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణపై గవర్నర్తో మాట్లాడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.