సాక్షి డైలీకి సుప్రీం అక్షింతలు: పిల్ తోసివేత, జరిమానా
జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పు చెప్పింది. పిటిషనర్లు మనోహర రెడ్డి, నరసింహా రెడ్డి కేవలం దురుద్దేశ్యంతో, జస్టిస్ రమణను అపఖ్యాతి పాలు చేయాలనే మోసపూరిత ఎత్తుగడతోనే పిల్ వేశారని ధర్మాసనం తెలిపింది. 'ఇందులో ప్రజాహితం లేదు... జస్టిస్ రమణపై బురదజల్లాలనే ఎత్తుగడ మాత్రమే ఉంది' అని అభిప్రాయపడింది.
సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైన తర్వాతే, జడ్జిపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను సేకరించి, దాని ఆధారంగా ఈ పిటిషన్ వేసినట్లు అర్థమవుతోందని తెలిపింది. "ఈ పిటిషన్ను చాలా నైపుణ్యంతో డ్రాఫ్ట్ చేశారు. జస్టిస్ రమణను చెడుకోణంలో చూపించేలా ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను మెలితిప్పారు. పిటిషనర్లు ఎంత సమర్థులో, న్యాయవాది ఎంత అనుభవజ్ఞుడో ఈ పిటిషన్ను డ్రాఫ్ట్ చేసిన విధానం చూస్తేనే అర్థమైపోతుంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదికలోని అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది.
'జస్టిస్ రమణపై ఉన్న కేసు రికార్డులను నిజాయితీతో, నిష్పాక్షికంగా పరిశీలించి ఉంటే... మేం ఈ తీర్పులో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన నివేదికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలే వారికీ కలిగేవి. ఈ పిటిషన్లో చిత్తశుద్ధి లేదు. ఏదైనా తప్పును సరిచేయాలనే నిజాయితీ లేదు. జస్టిస్ రమణను అపఖ్యాతి పాలు చేయడమే వారి అసలు ఉద్దేశం'' అని ధర్మాసనం స్పష్టం చేసింది. సీవీసీ కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసుకూ వర్తింప చేయాలన్న వాదనను తోసి పుచ్చింది.
ఇద్దరు పిటిషనర్లకు రూ.50వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగుల సంక్షేమ నిధికి నాలుగు వారాల్లోపు జమ చేయాలని ఆదేశించింది. అయితే, జరిమానాపై పునః పరిశీలించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది సెంథిల్ జగదీశన్ విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే జరిమానా విధించామని, దానికి కట్టి తీరాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.