నేరెడ్మెట్ పోలీస్లపై ముషీరాబాద్లో సుష్మిత ఫిర్యాదు
ఫిర్యాదు అనంతరం సుష్మిత మీడియాతో మాట్లాడారు. డిజిపి దినేష్ రెడ్డి సతీమణి ఆస్తుల వివరాలను తన తండ్రి అడిగారని, అదే రోజు ఆయనను పోలీసులు తీసుకు వెళ్లారని ఆరోపించారు. తన తండ్రి అరెస్టుకు డిజిపి, ఆయన సతీమణి ఆస్తుల వివరాలు అడగటమే కారణం కావచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిని తాను తన ఎఫ్ఐఆర్లో కలిపానన్నారు. కోర్టులపై తనకు నమ్మకముందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకోకుంటే కోర్టుకు వెళ్తానని చెప్పారు.
పోలీసులతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సిఎం పైన ఎర్ర చందనం కేసులో తన తండ్రి ఫిర్యాదు చేశారని, ఆ కేసును ఉపసంహరించుకోమని కిరణ్ ఒత్తిడి తెచ్చినా తగ్గలేదన్నారు. ఇది కూడా తన తండ్రిపై పోలీసులు అలా ప్రవర్తించేందుకు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. సిఎం, డిజిపితో పాటు నలభై మంది పోలీసులపై తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కాగా తన తండ్రిని గత గురువారం పోలీసులు తీసుకు వెళ్లిన తీరుపై ఆమె పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని, తన తండ్రిని అరెస్టు చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)చే విచారణ జరిపించాలని ఈ సందర్భంగా సుష్మిత డిమాండ్ చేశారు.
తన తండ్రిని ఎలాగైనా జైలుకు పంపించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పుడు తన తండ్రితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిఐడి విచారణకు ఆదేశించిందని కానీ, తాను సిబిఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తన తండ్రి 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయకుంటే ఎలా అని సుష్మిత ప్రశ్నించారు. పోలీసులపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు.
గ్రీన్ ఫీల్డ్ వ్యవహారంలో గత గురువారం సాయంత్రం పోలీసులు శంకరరావును అరెస్టు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దళిత సంఘాలు, మంత్రులు.. ఇలా పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవడంతో పోలీసులు తాము అతనిని అరెస్టు చేయలేదని విచారించేందుకు తీసుకు వెళ్లామని చెప్పారు. అనంతరం శంకరరావు అనారోగ్యానికి గురి కావడంతో పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు.