జగన్ పార్టీలో చేరుతున్నా, రాజకీయ షేర్ఖాన్గా: శ్రీహరి
భేటీ అనంతరం మాట్లాడుతూ.. తాను జగన్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు శ్రీహరి చెప్పారు. తాను రాజకీయాల్లో కూడా షేర్ ఖాన్గా నిరూపించుకుంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కూడా జగన్ను కలిశారు.
జగన్ను కలిసిన వీరిద్దరూ పార్టీలో చేరే ముహూర్తం పైన చర్చించినట్లుగా ప్రచారం సాగుతోంది. ద్వారంపూడి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన తొలి నుండి జగన్కు మద్దతిస్తున్నారు. మధ్యలో కొన్నాళ్లూ జగన్కు హ్యాండ్ ఇచ్చినప్పటికీ తిరిగి మళ్లీ ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల పలుమార్లు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతను, గౌరవాధ్యక్షురాలిని కలిశారు.
మరోవైపు శ్రీహరి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కొద్ది నెలల క్రితం హీరో శ్రీహరి అనూహ్యంగా బయటకు వచ్చి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పుడు చాలామంది స్వాగతించారు.
శ్రీహరి వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీహరి కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు ఓ ప్రముఖ హీరోను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో హైదరాబాదులో ఏదో ఒక స్థానం నుండి శ్రీహరి పోటీ చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.