అక్బర్కు కడుపునొప్పి: సబిత వద్ద ఏడ్చిన కార్పోరేటర్
ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అరెస్టుపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రాజేంద్రనగర్ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మజ్లీస్ నాయకులు, కార్యకర్తలు శనివారం అడ్డుకున్నారు. ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి, తమ పార్టీ నేతలపై దౌర్జన్యం చేస్తోందని వారు విమర్శించారు.
అక్బరుద్దీన్పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన మజ్లీస్ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు హోం మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మజ్లీస్ అత్తాపూర్ కార్పోరేటర్ సబితా ఇంద్రారెడ్డి వద్ద ఏడ్చేశారు. అక్బరుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన మంత్రికి చెప్పుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను అక్బరుద్దీన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్లో కూడా ఓ కేసు నమోదైంది. రాష్ట్రంలోని పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన బెయిల్ లభించడం లేదు.