ఉరిపై తప్పిన అఫ్జల్ గురు అంచనా: ఏమన్నాడు?
తనకు ఉరిశిక్ష విధించే విషయంపై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం కష్టమని, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వస్తే తనకు కచ్చితంగా ఉరి శిక్ష వేస్తుందని అతను చెప్పాడు. జైలులో తనకు జీవితం నరకంలా ఉందని అన్నాడు. తనకు ఉరిశిక్ష అమలు చేసే విషయంలో ప్రబుత్వం రెండు నెలల్లో ఏదో ఒక నిర్ణయానికి రావాలని అఫ్జల్ గురు ఆ ఇంటర్వ్యూలో అన్నాడు.
అఫ్జల్ గురు నమ్మకానికి భిన్నంగా యుపిఎ ప్రభుత్వం ఉరిశిక్ష వేయడమే కాకుండా ఆ ప్రక్రియను అత్యంత రహస్యంగా కొనసాగించింది. ముంబై ఉగ్రవాదుల దాడి కేసులో కసబ్కు ఉరిశిక్ష విధించిన తర్వాత అఫ్జల్ గురు ఉరిశిక్ష కోసం ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.
అఫ్జల్ గురు 2011 సెప్టెంబర్లో ద సండే ఇండియన్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇదే బహుశా అతని చివరి ఇంటర్వ్యూ. తనకు మరణ శిక్ష వేయడం అనేది రాజకీయ అంశమని అతను అన్నాడు. తనకు మరణశిక్ష వేస్తేనే దేశం సామూహిక చేతన సంతృప్తి చెందుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లు అతను తెలిపాడు. మనోభావాలను, చేతనను బట్టి న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వవని, న్యాయసూత్రాల ప్రకారమే తీర్పులు ఇస్తాయని అన్నాడు.
తనకు ఉరిశిక్ష వేస్తే కాశ్మీర్ పరిస్థితి గందరగోళంగా మారుతుందని అన్నాడు. తనకు ఉరిశిక్ష వేస్తే కేంద్ర ప్రభుత్వం తమను అణచివేస్తోందనే భావనకు కాశ్మీరీలు గురవుతారని అన్నాడు. 1984 వరకు కాశ్మీర్లో మిలిటెన్సీ లేదని, మక్భూల్ భట్ను ఉరితీసిన తర్వాతనే అది పెరిగిందని అభిప్రాయపడ్డాడు. తనకు మరణశిక్ష వేస్తే న్యాయం కోసం పోరాడిన అమరవీరుడిగా తనను గుర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో అఫ్జల్ గురును ఉరితీసి కాంగ్రెసు నాయకత్వం పైచేయి సాధించాలని అనుకున్నట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద, అఫ్జల్ గురును ఉరితీయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బిజెపి నుంచి వచ్చే విమర్శలను కాచుకుందని చెప్పవచ్చు.