అందరిలో ఆందోళన, బాధ్యత పెరిగింది: తెలుగుపై కిరణ్
తెలుగులో తీర్పు ఇచ్చేందుకు న్యాయవ్యవస్థ ముందుకొస్తే ప్రభుత్వంపై బాధ్యత ఇంకా పెరిగిందన్నారు. వాదనలు, తీర్పులు తెలుగులో ఉంటే కక్షిదారులకు సులభమవుతుందన్నారు. తెలుగు కోసం ఈ న్యాయపాలన సదస్సులో తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. న్యాయ వ్యవస్థ తెలుగులో తీర్పు ఇచ్చేందుకు ముందుకు రావడం ద్వారా తమపై ఒత్తిడి మరింత పెరిగిందన్నారు.
తెలుగును కాపాడుకుంటూనే విద్యార్థులు ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించాలని హితవు పలికారు. ఆంగ్లానికి, తెలుగుకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలుగు భాష మరింత అమలుకు అందరి సహకారం అవసరమన్నారు. ఏడాది పొడుగునా తెలుగు భాషాభివృద్ధికి చర్యలు తీసుకునే అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి వంద కిలోమీటర్లకు తెలుగు భాష, యాస మారుతుందన్నారు. అయితే, తెలుగు భాషను మాత్రం మరువవద్దన్నారు.
ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేశామన్నారు. ప్రతి చోట తెలుగు వినిపించేలా, కనిపించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇతర భాషల కంటే మాతృభాషలో భావ వ్యక్తీకరణ ఉంటుందని చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ అన్నారు. మాతృభాష ఆవశ్యకతను ఠాకూర్ ఎప్పుడో చెప్పారన్నారు. జర్మన్, ఫ్రెంచ్ దేశాలు మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాయని ఘోష్ చెప్పారు.
న్యాయమూర్తులకు సమాజంతో సంబంధం లేదన్న అపోహ ఈ సదస్సుతో తీరిపోతుందని జస్టిస్ రమణ అన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థ పైన ప్రజలకు అపార నమ్మకముందన్నారు. ప్రాంతీయ భాషలోనే న్యాయపాలన జరిగితే న్యాయవ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
న్యాయపాలన, సాక్ష్యాల నమోదు, తీర్పు తెలుగులో ఉండటం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. తెలుగులో న్యాయపాలన జరిగితే న్యాయస్థానాల పైన ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. న్యాయపాలన తెలుగులో అందించేందుకు ముందుకు రావడం చారిత్రాత్మకం అన్నారు. ప్రాంతీయ ప్రజలకు అర్థమయ్యే భాషలోనే న్యాయస్థానాల కార్యకలాపాలు ఉండాలని రాజ్యాంగం నిర్ధేషించిందని అన్నారు.