దాడి టైంలో అఫ్జల్కు ఉగ్రవాది ఫోన్: పశ్చాత్తాపం లేదు
దాడి జరగడానికి కొద్ది ముందు ఫిదాయీలలో ఒకడైన మహమ్మద్ నుంచి అఫ్జల్ గురు మొబైల్కు కాల్స్ వచ్చాయి. మన పథకం అమలు చేస్తున్నామని వారి సంభాషణల సారాంశం. పార్లమెంటుపై దాడికి దిగిన ఐదుగురు ఉగ్రవాదులు మహ్మద్, హైదర్, హమ్జా, రాణా, రజాలకు ఢిల్లీలోని గాంధీ విహార్, ఇందిరా విహార్లో వసతి ఏర్పాటు చేయడంలోనూ అఫ్జల్ గురు కీలకపాత్ర పోషించాడు.
పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలు, ఇతరత్రా వస్తు సామగ్రి సమకూర్చిపెట్టాడు. ఒకవైపు ఉగ్రవాదులతో, మరోవైపు ఇదే కేసులో నిందితులైన ఎస్ఏఆర్ గిలానీ, షౌకత్ హుస్సేన్, అఫ్సాన్ గురులతో సంబంధాలు నెరిపింది అఫ్జల్ గురు మాత్రమే. ఇందుకు పక్కా ఆధారాలు లభించాయి. అఫ్జల్ ప్రత్యక్షంగా దాడిలో పాల్గొనడం మినహా అంతా చేశాడు. ఐదుగురు ఉగ్రవాదుల్లో అందులో మహమ్మద్తో అఫ్జల్ గురుకు సన్నిహిత సంబంధాలున్నాయి.
ఇది అనేక కుట్రలతో ముడిపడిన విషయం. నేరపూరిత కుట్రకు సంబంధంపై ఒప్పందం కుదిరినట్లు ప్రత్యక్ష ఆధారాలు లభించకపోవచ్చు. కానీ, పరిస్థితులను, ఆధారాలను సమగ్రంగా పరిశీలిస్తే ఉగ్రవాదులతో అఫ్జల్ గురు చేతులు కలిపినట్లు స్పష్టంగా తెలిసిపోతుందని సుప్రీం కోర్టు చెప్పింది. అఫ్జల్ గురు చర్యలు, గత చరిత్ర, వర్తమానం అన్నీ అతని దోషిత్వాన్ని రుజువు చేస్తున్నాయని పేర్కొంది.
పశ్చాత్తాపం లేదు
కాగా ఉరికంబం వద్దకు తీసుకెళ్లే ముందు అఫ్జల్ గురులో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. చివరి క్షణాల్లో అతను ప్రశాంతంగా కనిపించాని, చేసిన పనికి విచారపడుతున్నట్లు కనిపించలేదని తీహార్ జైలు సీనియర్ అధికారులు చెప్పారు. ఉరి సంగతి అఫ్జల్కు శుక్రవారం సాయంత్రం తెలియజేశామని, అప్పటి నుండి కొద్దిగా కలవరపడినట్లు కనిపించిందన్నారు. తీహార్ కారాగారంలోని జైలు నెంబరు 3లో 16 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉన్న గదిలో 10 ఏళ్లకు పైగా అఫ్జల్ ఉన్నాడు.
ఉరికంబానికి ఆ గది 20 మీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం రాత్రి అతనికి నిద్రలేని రాత్రేనని, తెల్లవారు జాము 5 గంటలకు నిద్ర లేచి సిద్ధంగా ఉండాలని చెప్పామని, ఆ సమయానికే నిద్ర లేపామన్నారు. నిద్ర లేచిన వెంటనే నమాజు చేసుకున్నట్లు చెప్పారు. టీ ఇస్తే తాగలేదు. ఉరి గురించి చెప్పగానే ఖురాన్ ఇవ్వాలని జైలు అధికారుల్ని అడిగాడు. శుక్రవారం సాయంత్రం రోటీ, పప్పు, కూర ఇచ్చినా తినలేదని చెప్పారు.
కాగా అఫ్జల్ ఉరి గురించి అఫ్జల్ కుటుంబానికి స్పీడ్ పోస్ట్ ద్వారా సమాచారమిచ్చినట్లు హోంశాఖ చెప్పింది. కాగా 2001 డిసెంబర్ 13న పార్లమెంటు దాడిలో మృతి చెందిన మహిళ గ్రామమైన సికిందరపుర్(కనౌజ్ జిల్లా)లో అఫ్జల్ గురు ఉరితీత తెలిసిన గ్రామస్తులు గుమికూడి పండుగ చేసుకున్నారు.