రాజకీయాలపై ఆసక్తి లేదు, సహన పరీక్ష: కమల్హాసన్
తమిళనాడు ప్రభుత్వం విశ్వరూపంను నిషేధించిన సమయంలో కర్నాటక నుండి తనకు సంఘీభావం లభించిందన్నారు. ప్రేక్షకులు, అభిమానులు చూపుతున్న ఆదరణ వల్ల విశ్వరూపం రెండో భాగాన్ని రూపొందించేందుకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు. విశ్వరూపం సినిమా విడుదల వివాదంలో తాను ఆర్థికంగా నష్టపోయానని చెప్పారు. అయితే, తాము ఆ నష్టం భరిస్తామని అభిమానులు ముందుకు వచ్చి సినిమాను ఆదరిస్తున్నారన్నారు.
మల్లేశ్వరంలోని రేణుకాంబ థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమల్ మాట్లాడారు. ఎపి, కర్నాటక, కేరళ రాష్ట్రాల ప్రభుత్వాల పోలీసు అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా, ఏ వర్గాన్ని కించపర్చే విధంగా విశ్వరూపం సినిమా తీయలేదన్నారు. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారన్నారు. ముస్లింలు సైతం సినిమా విడుదలకు సహకరించారన్నారు.
తాను భారతదేశం వదిలి వెళ్లినా భారతమాత ముద్దుబిడ్డనే అన్నారు. తనని, తన అభిమానుల సహనాన్ని పరీక్షించారని, తమకు చాలా ఓపిక ఉందన్నారు. విదేశాల్లోను సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. వచ్చే వారం ఫ్రాన్స్లో హిందీ, తమిళ వర్షన్ విడుదల చేస్తామన్నారు. విశ్వరూపం 2 సినిమా వివాదంలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని కమల్ చెప్పారు. కాగా కమల్ పలు ప్రశ్నలకు కన్నడలో సమాధానం ఇచ్చే ప్రయత్నాలు చేశారు.