కుంభమేళాలో తొక్కిసలాట: 36 మంది భక్తుల మృతి
అలహాబాద్: అత్యంత పవిత్ర దినంగా భావించే మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పుణ్యస్నానాల కోసం తండోపతండాలుగా అలహాబాద్లో భక్తులు వెల్లువెత్తారు. దాదాపు మూడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఓ అంచనా. ఆ సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 36 మంది భక్తులు మరణించారు. దాదాపు 30 మంది గాయపడ్డారు.
ఓవర్బ్రిడ్జికి ఉండే రెయిలింగ్ విరిగిపోవడంతో ఆరో నెంబరు ప్లాట్ఫారంపై ఈ తొక్కిసలాట జరిగింది. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అంతకుముందు సెక్టార్12లో సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మరణించారు. వీరిలో ఒకరు వారణాసికి చెందిన భక్తురాలు కాగా, మరొకరు పశ్చిమబెంగాల్కు చెందిన మధ్య వయస్కుడు. రాత్రి ఏడు గంటలకు 5, 6 నెంబరు ప్లాట్ఫారాలపై ఈ దుర్ఘటన జరిగే సమయానికి వేలాది మంది ప్రయాణికులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆరో నెంబరు ప్లాట్ఫారంపైకి రైలు వస్తున్నట్లు ప్రకటన రావడంతో ఒకేసారి వందలాది మంది ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కారని, అప్పుడే రెయిలింగ్ విరిగిపడిందని అంటున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదని రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెప్పారు.
పెద్దయెత్తున గుమిగూడిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేసినట్లు భక్తులు చెబుతుండగా, వారు కేవలం ప్రయాణికులను ఒక వరుసలో వెళ్లాల్సిందిగా నియంత్రించారు తప్ప లాఠీలు ఝళిపించలేదని డివిజనల్ రైల్వే మేనేజర్ హరీందర్రావు అన్నారు. సంఘటన జరిగే సమయానికి ఒకే చోట 4వేల మంది భక్తులున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు శనివారం సాయంత్రం నుంచే అలహాబాద్కు వెల్లువెత్తారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 3 కోట్ల మంది స్నానాలు చేశారని కుంభమేళా అధికారి మణిప్రసాద్మిశ్రా తెలిపారు.
అలహాబాద్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించడం పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి అన్సారీ కూడా భక్తుల మృతిపట్ల సంతాపం తెలిపారు. మరోవైపు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.