మహా కుంభ మేళా తొక్కిసలాట: అజంఖాన్ రాజీనామా
అలహాబాదులో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటన కుంభ మేళా జరుగుతున్న ప్రాంతంలో జరగలేదని అయినప్పటికీ, దానికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నానని అజం ఖాన్ చెప్పారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానన్నారు. తాను తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు పంపిస్తున్నానని అన్నారు.
ఈ ఘటనతో తాను బాగా ఆవేదనకు గురయ్యానని అజం ఖాన్ చెప్పారు. మహా కుంభ మేళాలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలని, ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు. అలహాబాదు ప్రమాద ఘటనలో 36 మంది చనిపోగా మరో పద్నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ప్లాట్ ఫారం నెంబర్ 6లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద జరిగింది. ఈ ఘటన ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది.
ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా అలహాబాదు వద్ద జరిగిన కుంభ మేళాకు భారీగా భక్తులు తరలి వచ్చారు. అలహాబాదు రైల్వే స్టేషన్ నుండి దాదాపు లక్షన్నర మంది భక్తులు తమ తమ ప్రాంతాలకు చేరుకోవడానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. తొక్కిసలాట జరగడంతో ప్రమాదం జరిగింది. కాగా అలహాబాదు తొక్కిసలాటలో మృతి చెందిన వారి బంధువులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నుండి సరైన స్పందన లేదంటూ మృతుల బంధువులు నిరసనకు దిగారు. మృతదేహాలపై కప్పే గుడ్డ కోసం కూడా తమను ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడిగారని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు అలహాబాద్ డివిజనల్ కమిషనర్ను అడ్డుకున్నారు. మృతుల వివరాల జాబితాను వెంటనే విడుదల చేయాలని కోరారు.