చెంప పగలకొడతా: ఫోటోజర్నలిస్ట్కు మమత బెదిరింపు
ఈ సమయంలో మమతా బెనర్జీని ఫోటో తీసేందుకు ఓ ఫోటో జర్నలిస్టు ఆసక్తి కనబర్చాడు. ఆమెను ఫోటో తీసేందుకు అతను ముందుకు వచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన దీదీ.. మీకు నాగరికత తెలియదు. చెంప పగలగొడతా. ఇక్కడ జరుగుతున్నది మీకు కనిపించడం లేదా? అంటూ సదరు ఫోటో గ్రాఫర్ పైన ఆమె విరుచుకు పడ్డారు. ఆదివారం రోజు అన్ని టీవీ ఛానళ్లలో ఈ సన్నివేశాన్ని పదే పదే ప్రదర్శించారు.
శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో దీదీ మాటీ ఉత్సవంలో ఓ స్టాల్ తిలకిస్తుండగా ఇది జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దీదీ మూడ్ ఫోటో జర్నిలిస్టు ఫోటో తీసేందుకు ఆత్రుతపడుతూ ముందుకు రావడంతో ఒక్కసారిగా మారిపోయింది. ఫోటో జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పది నిమిషాల తర్వాత మమతా బెనర్జీ అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే ఆమె తీరు అక్కడున్న వారిని ఒక్కసారిగా షాక్కు గురి చేసింది.
ఈ ఐదు రోజుల్లోనే ఆమె సహనం కోల్పోవడం ఇది రెండోసారి. ఇటీవల కోల్కతాలో జరిగిన పుస్తక ప్రదర్శనలో తన భద్రతా సిబ్బందిని ఆమె దుర్భాషాలాడారు. తన కారును ఆలస్యంగా తీసుకు రావడంతో ఆమె వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. మమతా బెనర్జీ తీరు పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. తాజా ఘటన ఆమె నియంతృత్వ పోకడలకు నిదర్శనమని సిపిఎం ధ్వజమెత్తింది. మమత తీరు దురదృష్టకరమని... ఓపికతో ఉండాలని పిసిసి అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు.