అగస్టా చాపర్: తప్పు చేయలేదన్న మాజీ ఎయిర్ చీఫ్
కాగా కొన్నాళ్లుగా అవినీతి ఆరోపణలకే పరిమితమైన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారం సరికొత్త మలుపులు తీసుకుంది. ప్రముఖుల పర్యటనల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో లంచాలు చేతులు మారిన ఆరోపణలపై ఇటలీలో చర్యలు ప్రారంభమయ్యాయి. రూ.3,600కోట్ల విలువైన 12 అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల సరఫరాకు ఇటలీ కంపెనీ ఫిన్ మెక్కానికా భారత రక్షణ శాఖతో 2010లో ఒప్పందం కుదుర్చుకుంది.
అగస్టా వెస్ట్లాండ్ మాతృసంస్థ, ఇటాలియన్ కంపెనీ ఫిన్ మెక్కానికా చైర్మన్, ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) గుసెప్పే ఓర్సిని అవినీతి ఆరోపణలపై ఇటలీలోని మి లాన్లో పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అలాగే, అగస్టా వెస్ట్లాండ్ సీఈవో బ్రూనో స్పంగ్నోలి కూడా హౌస్ అరెస్ట్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ సాధించడం కోసం రూ.362 కోట్ల మేరకు ఫిన్మెక్కానికా భారత్లో లంచాలు ముట్టజెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా ఆరోపణల నేపథ్యంలో అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంపై సిబిఐ విచారణకు రక్షణశాఖ మంత్రి ఆంటోనీ మంగళవారం ఆదేశించారు. వాస్తవానికి ఒప్పందం ప్రకారం ఇప్పటికే మూడు అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్లను ఫిన్మెక్కానికా భారత్కు సరఫరా చేసింది. మిగతా తొమ్మిది హెలికాప్టర్లను వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో సరఫరా చేయాల్సి ఉంది. తాజా ఆరోపణల నేపథ్యంలో మిగతా వాటిని గుమతిని నిలిపివేయాలని రక్షణ మంత్రి ఆంటోనీ ఆదేశించారు.
అవినీతి ఆరోపణలపై ఓర్సిని సోమవారం అరెస్ట్ చేశారని ఇటలీ వార్తా సంస్థ అన్సా వెల్లడించింది. రూ.3,600 కోట్ల ఒప్పందం సొంతం చేసుకునేందుకు మొత్తం ఒప్పందం విలువలో సుమారు పది శాతం రూ.362 కోట్ల వరకూ అగస్టా కంపెనీ తరఫున ఓర్సి భారత్లో లంచాల రూపంలో ఖర్చు చేశారని విచారణ అధికారులు భావిస్తున్నారని అన్సా వెల్లడించింది.