అపరాధచిచ్చు: 5000 ట్రిపుల్ ఐటి విద్యార్థుల సస్పెన్షన్
అపరాధ రుసుం పేరిట వేధిస్తున్నారని వారు ఆరోపించారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల వరకు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు అధికారుల కార్యాలయాల ఎదుట బైఠాయించారు. దీంతో ప్రవర్తన సరిగా లేదంటూ ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి చెందిన ఐదువేల మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉదయం ప్రకటించారు.
విద్యార్థులు బుధవారం సాయంత్రానికల్లా కళాశాల వదిలి వెళ్లాలని ఆదేశించారు. దీన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థులు కార్యాలయం వద్ద బైఠాయించారు. దీంతో సుమారు 200 మంది విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. ఈ ఘటనపై నిర్మల్ ఆర్డీవో భుజన్న బుధవారం సాయంత్రం కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ వైస్ చాన్స్లర్ రాజ్ కుమార్ పరిస్థితి చక్కబెట్టేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా విషయం తెలుసుకున్న ముథోల్ సిఐ శ్రీనివాస్ ట్రిపుల్ ఐటి ప్రాంగణానికి చేరుకొని విద్యార్థులను శాంతింపచేశారు. కాగా పరిస్థితి సద్దుమణగడంతో యాజమాన్యం కూడా సస్పెన్షన్ అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం.