లేఖ నేనే రాశా, వేధించారే కానీ: పెదవివిప్పిన టీచర్ లీల
అక్కడ న్యాయమూర్తి లేకపోవడంతో ఆమెను రాజేంద్రనగర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లీల వాంగ్మూలం నమోదుకు కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ సందర్భంగా లీల మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య లేఖను తానే రాశానని ఆమె చెప్పారు. ఆయన తనను వేధించిన మాట వాస్తవమేనని, దీనిపై కేసు కూడా పెట్టామని చెప్పారు. తన అదృశ్యానికి మాత్రం ఎస్సై కారణం కాదన్నారు.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. ఇబ్బందుల కారణంగా యూసఫ్గూడలోని ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని చెప్పారు. ఎస్సై వేధించిన సందర్భాలు ఉన్నాయని, ఆయనను సస్పెండ్ చేయడం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. ఎస్సై గతంలో తనను మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు లీల సోదరుడితో పాటు మరొకరిని విచారించారు. తమను విచారణ కోసమే పిలిచారని లీల సోదరుడు చందు చెప్పారు.
ఫోన్ సంభాషణలు గుర్తించాం: డిసిపి
లీల, సుధీర్ ఫోన్ సంభాషణలు, సంక్షిప్త సందేశాలను తాము గుర్తించామని మాదాపూర్ డిసిపి యోగానంద్ అన్నారు. సాఫ్టువేర్ ఉద్యోగిని నీలిమ కేసులోను మీడియా పోలీసుల విచారణపై అనుమానాలు వ్యక్తం చేసిందని కానీ, మహిళల డిగ్నిటీ దృష్ట్యా కొన్ని విషయాలు బయటపెట్టలేమని ఆయన అన్నారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తప్పు ఎవరిదైతే వారిపై చర్య తీసుకుంటామన్నారు. ఎస్సై సిక్ లీవ్లో ఉన్నారన్నారు.