ఎస్సై వేధింపులు: కోర్టుకు హాజరైన లీల, వాంగ్మూలం
కాగా ఎస్సై వేధింపుల కేసుపై టీచర్ లీల శుక్రవారం పెదవి విప్పిన విషయం తెలిసిందే. దుండిగల్ ఎస్సై సుధీర్ వేధింపుల ఆరోపణలతో లీల ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యం కావడం, ఎస్సైని సస్పెండ్ చేయడం, లీల, కుటుంబ సభ్యులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిచడం తెలిసిందే. లీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదట ఆమెను మియాపూర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. అక్కడ న్యాయమూర్తి లేకపోవడంతో ఆమెను రాజేంద్రనగర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. ఈ రోజు మరోసారి హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఆమె వచ్చి వాంగ్మూలం ఇచ్చారు.
నిన్న లీల మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య లేఖను తానే రాశానని ఆమె చెప్పారు. ఆయన తనను వేధించిన మాట వాస్తవమేనని, దీనిపై కేసు కూడా పెట్టామని చెప్పారు. తన అదృశ్యానికి మాత్రం ఎస్సై కారణం కాదన్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. ఇబ్బందుల కారణంగా యూసఫ్గూడలోని ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లానని చెప్పారు. ఎస్సై వేధించిన సందర్భాలు ఉన్నాయని, ఆయనను సస్పెండ్ చేయడం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు.
ఎస్సై గతంలో తనను మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు లీల సోదరుడితో పాటు మరొకరిని విచారించారు. తమను విచారణ కోసమే పిలిచారని లీల సోదరుడు చందు చెప్పారు. మరోవైపు లీల, సుధీర్ ఫోన్ సంభాషణలు, సంక్షిప్త సందేశాలను తాము గుర్తించామని మాదాపూర్ డిసిపి యోగానంద్ నిన్ననే చెప్పారు.