ఎస్సెమ్మెస్ చేస్తే రిప్లై ఇచ్చేదాన్ని, వేధించారనే: టీచర్ లీల
ఎస్సై తనను తరుచూ ఫోన్లో వేధించే వాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వేధింపులు తట్టుకోలేక తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. తన మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లనే తాను లేఖ రాసి ఇంటి నుండి వెళ్లానని ఆమె వివరణ ఇచ్చారు. తాను ఇళ్లు విడిచి వెల్లడంలో ఎవరి ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేశారు.
కాగా అంతకుముందు కోర్టుకు హాజరైన లీల వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం రాజేంద్ర నగర్ కోర్టుకు హాజరైన లీల కోర్టులో వివరణ ఇచ్చారు. ఉప్పరపల్లి 8ఎంఎం కోర్టులో లీల దాదాపు గంటపాటు మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. తాను లేఖ రాసి అదృశ్యమైనప్పటి నుండి, యూసఫ్ గూడలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రాత్రీ పిఎస్లోనే విచారించడం, సుధీర్ వేధింపులు తదితర అన్నింటిని ఆమె న్యాయమూర్తికి వివరించినట్లుగా సమాచారం.
ఎస్సై వేధింపుల కేసుపై టీచర్ లీల శుక్రవారం బయటకు వచ్చి పెదవి విప్పారు. దుండిగల్ ఎస్సై సుధీర్ వేధింపుల ఆరోపణలతో లీల ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యం కావడం, ఎస్సైని సస్పెండ్ చేయడం, లీల, కుటుంబ సభ్యులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిచడం తెలిసిందే. లీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదట ఆమెను మియాపూర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. అక్కడ న్యాయమూర్తి లేకపోవడంతో ఆమెను రాజేంద్రనగర్ కోర్టుకు తీసుకు వెళ్లారు. ఈ రోజు మరోసారి హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో ఆమె వచ్చి వాంగ్మూలం ఇచ్చారు.