హోదా వివాదం: షాహీ స్నాన్కు రాని నిత్యానందస్వామి
అలహాబాద్: రాసలీలల కేసుతో పాటు పలు వివాదాల్లో చిక్కుకున్న నిత్యానంద స్వామినినాగా సాధువులకు చెందిన మహా నిర్వాణి అఖాడా నిత్యానందను ఘనంగా సన్మానించిన విషయం తెలిసిందే. నిత్యానందకు మహా మండలేశ్వర్ అనే బిరుదును బహూకరించింది. దీనిపై మొదటి నుండి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. శుక్రవారం వసంత పంచమి సందర్భంగా మహా కుంభ మేళాకు భక్తులు మరోసారి పోటెత్తారు.
ఈ మేళాలో నిత్యానంద కలకలం మరోసారి చెలరేగింది. ఎంతో విశిష్టంగా భావించే మహా మండలేశ్వర్ హోదాను నిత్యానందకు కట్టబెట్టడం పట్ల అఖిల భారత అఖారా పరిషత్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగా సాధువులకు, స్నానాలకు నేతృత్వం వహించే హోదా మహా మండలేశ్వర్కు ఉంటుంది. దీంతో అఖిల భారత అఖారా పరిషత్ నిత్యానందకు ఇలాంటి హోదా ఇవ్వడాన్ని ఖండించింది.
ఎన్నో దశలు దాటుకున్న తర్వాతనే ఈ దశకు చేరుకోవాల్సి ఉంటుందని కానీ, కొందరు ఈ అత్యున్నత పదవిని డబ్బులతో కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ వివాదం నేపథ్యంలో నిత్యానంద స్వామి శుక్రవారం నాటి షాహి స్నానానికి కూడా వెళ్లలేదు.
కాగా, శుక్రవారం వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంకు భక్తులు పోటెత్తారు. హరోంహర నామస్మరణలతో మార్మోగింది. మహాకుంభ మేళా సందర్భంగా వసంత పంచమి రోజైన లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. వేలమంది అఖారాలు పవిత్ర స్నానం(షాహీ స్నాన్) చేశారు.