అకాల వర్షాలు: వేల ఎకరాల పంటనష్టం, 17మందిమృతి
హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో దాదాపు యాభై వేల హెక్టార్ల పంట నీట మునగగా, 17 మంది మృతి చెందారు. అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు మార్కెట్ యార్డుల్లో పత్తి, మిర్చి, పసుపు తడిసిపోయాయి. తీవ్రమైన నష్టం సంభవించింది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో దాదాపు ఇరవై వేల హెక్టార్ల పంట నష్టం సంభవించింది.
కరీంనగర్లో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం జిల్లాలో పొగాకు, శనగ, పత్తి పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పిడుగులు, కరెంటు షాకులతో పదిహేడు మంది మృతి చెందారు. ఇప్పుడిప్పుడే కాస్తున్న మామిడి పిందెలు రాలిపోయాయి. ఈ ఆకాల వర్షాల కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఎక్కవగా నష్టం జరిగింది. మార్కట్ యార్డుల్లో పంటలు తడిసి ముద్దవడమే కాకుండా పలుచోట్ల నీటిలో కొట్టుకుపోయాయి.
రైతు దశ తిప్పాల్సిన పొద్దుతిరుగుడు మొక్కలు ఎవరో మెలితిప్పినట్లుగా నేలనుకరిచాయి. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కురిసి రైతుకు తీవ్ర నష్టాన్ని, ఆవేదనను మిగిల్చింది. 17 జిల్లాల్లో శనివారం వర్షాలు కురిశాయి. కేవలం నాలుగు జిల్లాల్లోనే 20 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. వర్షాల కారణంగా నిజామాబాద్, గుంటూరు, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో పిడుగుపాటుకు, కరెంటు షాకుకు 17 మంది చనిపోయారు. పలు జిల్లాల్లో ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
కిరణ్ సమీక్ష
అకాల వర్షంతో జరిగిన విధ్వంసంపై ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఉన్నతాధికారులతో సమీక్షించి సహాయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. నంట నష్టంపై అధికారులు అప్పటికప్పుడు ఢిల్లీలోని సీఎంకు ఒక నివేదిక పంపించారు. పంట నష్టంపై వెంటనే మండల వ్యవసాయాధికారులతో సర్వే జరిపించి అంచనాలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆదేశించారు.