మోడిపై ఆర్టికల్: రాజీనామాలపై జైట్లీ వర్సెస్ కట్జూ
జైట్లీ వ్యాఖ్యలపై కట్జూ ఘాటుగానే స్పందించారు. వాస్తవాలకు మసిపూసే బదులు రాజకీయ సన్యాసం చేస్తే మంచిదని ఆయన ఎదురుదాడికి దిగారు. ఆయన వ్యాఖ్యలపై జైట్లీ స్పందిస్తూ కట్జూ కాంగ్రెస్సేతర రాష్ట్ర ప్రభుత్వాలపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన అంతకుమించిన పదవేదో ఆశిస్తున్నారని ఎద్దేవా చాశారు. కాగా ఇప్పటికే బీహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులపై కట్జూ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా కట్జూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని టార్గెట్ చేసుకున్నారు. గుజరాత్ సిఎం నరేంద్ర మోడీకి గోధ్రా అనంతర అల్లర్లతో సంబంధం లేదంటే నమ్మలేమంటూ కట్జూ ఓ వ్యాసం రాశారు. దీని పైనే కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు, సిఎంలపై కట్జూ వరుస దాడులు చేయడం చూస్తే, రిటైరయ్యాక తనకో పదవి ఇచ్చిన వారిని సంతృప్తి పరచడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నట్లు ఉన్నదని జైట్లీ విమర్శించారు.
పిసిఐ చైర్మన్ పదవికి ఆయన అనర్హుడని, వెంటనే వైదొలగాలని బిజెపి డిమాండ్ చేసింది. భ్రమల్లో మునిగితేలే వ్యాధిగ్రస్థుడిలా కట్జూ దురుసుగా, బాహాటంగా అర్థంలేని వ్యాఖ్యలు చేయవద్దని జైట్లీ సూచించారు. నిజాలను కప్పిపుచ్చడం కన్నా రాజకీయ సన్యాసం చేస్తే మంచిదని జైట్లీకి కట్జూ కౌంటర్ ఇచ్చారు. కాగా, ఆయనో కామెర్ల రోగి అని, గుజరాత్ను ఆయన పచ్చకళ్లతో చూస్తున్నారని నరేంద్ర మోడి కట్జూపై ట్విట్టర్లో ధ్వజమెత్తారు. గుజరాత్ పైన కట్జూ బురద జల్లడంతోనే జైట్లీ స్పందించారని మోడి అన్నారు.